ఎన్డీఏ దెబ్బకు బడా విపక్ష నేతల రాజ్యసభ బాట.. ప్రధాని మోడీ విసుర్లు

by Dishanational4 |
ఎన్డీఏ దెబ్బకు బడా విపక్ష నేతల రాజ్యసభ బాట.. ప్రధాని మోడీ విసుర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. కొందరు బడా విపక్ష నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నారని, పార్లమెంటులోకి వచ్చేందుకు వాళ్లు రాజ్యసభ మార్గాన్ని వెతుక్కుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో రూ.21,400 కోట్లకుపైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో కలిసి ప్రధాని మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. బిహార్‌లో ఎన్‌డీయే బలపడిన తర్వాత రాచరిక పార్టీలు హడలిపోయాయని.. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పోటీ చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రాచరిక పార్టీలలో వారసత్వాన్ని అందుకునే నాయకులు తల్లిదండ్రుల నుంచి అధికారాన్ని కోరుకుంటున్నారే తప్ప.. తమ పూర్వీకులు చేసిన తప్పులను ఒప్పుకునే ధైర్యం చేయడం లేదని ఆయన మండిపడ్డారు.

నితీశ్‌ను పిలిచి మరీ..

బిహార్‌లో మరోసారి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడిందని.. ఇక రాష్ట్రంలో డెవలప్మెంట్ స్పీడు ఏమాత్రం తగ్గదని ప్రధాని వెల్లడించారు. ‘‘బిహార్ సీతా మాత భూమి.. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉత్సాహం వెల్లివిరిసింది. రాష్ట్ర ప్రజలంతా పులకించిపోయారు’’ అని మోడీ చెప్పారు. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న, అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అంశాలను కూడా ఈసందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. ఈ సభ సందర్భంగా గజమాలతో తనను సత్కరిస్తుండగా.. సీఎం నితీశ్‌ను పిలిచి మరీ ఆ మాలను ఆయనతో ప్రధాని మోడీ పంచుకోవడం విశేషం. సభలో సీఎం నితీశ్ ప్రసంగిస్తూ.. తాను ఇక ఎన్డీయేతోనే ఉంటానని, ఎక్కడికీ వెళ్లబోనని తేల్చి చెప్పారు. ‘‘మీరు (ప్రధాని మోడీ) ఇంతకుముందు కూడా బిహార్‌కు వచ్చారు. కానీ నేను అప్పట్లో గాయబ్ అయ్యాను. ఇప్పుడు మళ్లీ నేను మీతో చేయి కలిపాను. ఇక ఎటూ వెళ్లను. మీతోనే ఉంటాను’’ అని ముఖ్యమంత్రి నితీశ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed