మోడీ పుట్టుకతో ఓబీసీ కాదు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు

by Dishanational2 |
మోడీ పుట్టుకతో ఓబీసీ కాదు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ పుట్టుకతో ఓబీసీ కాదని, తనను తాను ఓబీసీగా పేర్కొంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఒడిశాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ ప్రసంగించారు. గుజరాత్‌లో తెలీ కులానికి చెందిన కుటుంబంలో జన్మించిన మోడీ, తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో తన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారని తెలిపారు. కాబట్టి మోడీ పుట్టుకతో ఓబీసీ కాదన్నారు. ఈ విషయం బీజేపీ కార్యకర్తలు కూడా తెలుసుకోవాలని సూచించారు. ప్రధాని ఓబీసీలతో కరచాలనం చేయరని, కానీ బిలియనీర్లను మాత్రం పదే పదే కౌగిలించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలను దోచుకోవడానికే బీజేపీతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం జతకట్టిందని విమర్శించారు. ఈ అవినీతి ప్రభుత్వాలను వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందన్నారు. కాగా, పార్లమెంటులో బుధవారం ప్రసంగించిన ప్రధాని మోడీ తనను తాను ఓబీసీ కులానికి చెందిన వ్యక్తినని వెల్లడించారు. కాంగ్రెస్ ఓబీసీలకు న్యాయం చేయలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే రాహుల్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు జోడో న్యాయ్ యాత్ర ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్ లోకి ప్రవేశించనుంది.


Next Story

Most Viewed