కీలక చట్టాల్లో మార్పులపై మోడీ సర్కార్ ఫోకస్!

by Disha Web Desk 4 |
కీలక చట్టాల్లో మార్పులపై మోడీ సర్కార్ ఫోకస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో నేరాలను అరికట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతోంది. ఇందులో భాగంగా బ్రిటీష్ జమానా నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ) చట్టాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టబోతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీ పోలీసు వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న అమిత్ షా ఫోరెన్సిక్, ఎవిడెన్స్ చట్టాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్‌లను అందజేశారు. ఈ వ్యాన్‌లు కేసుల ఛేదనలో సహాయపడతాయని అభిప్రాయపడ్డారు. జీ 20 కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నేరాల విషయంలో చట్టాల మార్పులపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమిత్ షా వ్యాఖ్యలతో ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో సమూల మార్పులపై కేంద్రం సీనియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న చట్టాల్లోని లోపాల వల్ల నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడటం లేదని, బాధితులకు సత్వర, సమర్థవంతమైన న్యాయం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ లోపాలను సరిదిద్దుతూ సమర్థవంతమైన రీతిలో నేరాలను అరికట్టేవిధంగా చట్టాల్లో మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే న్యాయనిపుణులతో కసరత్తు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ చట్టాల్లో మార్పులు తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు గతంలోనే సంకేతాలు ఇవ్వగా తాజాగా అమిత్ షా మరోసారి క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వూలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆరేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరాలకు ఫోరెన్సిక్ విచారణ తప్పనిసరి చేసేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్‌లలో మార్పులు తీసుకురాబోతోందని అమిత్ షా చెప్పారు. ఆ మరుసటి రోజే మరోసారి ఈ చట్టాల మార్పుపై స్పందించారు.

Next Story

Most Viewed