న్యూక్లియర్ టెక్నాలజీ వల్లే గంగా నదిలో పరిశుభ్రమైన నీళ్లు

by John Kora |
న్యూక్లియర్ టెక్నాలజీ వల్లే గంగా నదిలో పరిశుభ్రమైన నీళ్లు
X

- అంటువ్యాధులు రానిది అందుకే

- ఈ టెక్నాలజీ వెనుక బార్క్, ఐజీకార్

- వెల్లడించిన కేంద్ర సైన్స్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

దిశ, నేషనల్ బ్యూరో: 'మహా కుంభమేళాను పురస్కరించుకొని 50 కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర సంగమం వద్ద స్నానాలు చేసినా ఎవరికీ అంటు వ్యాధులు ప్రబల లేదు. గంగా నది నీళ్లను పరిశుభ్రంగా ఉండటమే ఇందుకు కారణం. త్రివేణి సంగమం వద్ద న్యూక్లియర్ టెక్నాలజీని వాడటం వల్లే గంగా నది నీళ్లు అత్యంత పరిశుభ్రంగా ఉన్నాయి' అని కేంద్ర సైన్స్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కుంభ మేళా సమయంలో గంగానదిలో నీటిని పరిశుభ్రంగా ఉంచడం కఠినమైన పనిగా ఆయన చెప్పుకొచ్చారు. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్), కల్పకంలోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (ఐజీకార్) రూపొందించిన మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ల వల్లే ఇది సాధ్యమయ్యిందని చెప్పారు. ఈ రెండు సంస్థలు కలిసి తయారు చేసిన హైబ్రీడ్ గ్రాన్యులర్ సీక్వెన్సింగ్ బాచ్ రియాక్టర్ల టెక్నాలజీని కుంభమేళాలో ఉపయోగించాము. ఈ న్యూక్లియర్ టెక్నాలజీ వల్లే గంగా నది నీళ్లు ఎంత మంది స్నానాలు చేసినా శుభ్రంగానే ఉన్నాయని చెప్పారు.

త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన సీవేజ్ ప్లాంట్లు మైక్రోబ్స్(సూక్ష్మజీవుల)ను ఉపయోగించి మురికి నీటిని శుభ్రపరుస్తాయని చెప్పారు. వీటిని ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లుగా పిలుస్తారని.. ఇది మలమూత్రాల వల్ల కలుషితం అయిన నీటిని కూడా స్వచ్ఛంగా మారుస్తాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ టెక్నాలజీని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలోపనిచేసే డాక్టర్ వెంకట్ నాంచారయ్య అభివృద్ధి చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగానది ఒడ్డున ఛత్తీస్‌గఢ్‌కు చెందిన స్టెల్లారిన్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. రోజుకు లక్షన్నర లీటర్ల మురుగు నీటిని శుభ్రపరిచే సామర్థాన్ని ఈ ప్లాంట్లు కలిగి ఉన్నట్లు మంత్రి జితేంద్ర పేర్కొన్నారు. బార్క్, ఐజీకార్‌ల న్యూక్లియర్ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి స్టెల్లార్ వెంచర్‌కు అనుమతి ఉందని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ తివారి చెప్పారు. ఆయన బార్క్‌ మాజీ ఉద్యోగి కావడం గమనార్హం.

Next Story