పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ ఆర్థిక సాయంపై భారత్‌ ఆగ్రహం

by Rani Yarlagadda |
పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ ఆర్థిక సాయంపై భారత్‌ ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసింది. ఇది గతంలో అంగీకరించిన 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీలో భాగం. పాక్ ఆర్థిక వ్యవస్థ స్థిరపడేందుకు, బాహ్య రుణభారాన్ని తగ్గించుకునేందుకు, విదేశీ మారక నిల్వల్ని మెరుగుపర్చుకునేందుకు ఈ రుణం సహాయపడనుంది. అయితే.. తాజాగా దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ సమయంలో పాక్‌కు రుణం ఇస్తే దానిని దుర్వినియోగం చేస్తుందని భారత్ ఆరోపిస్తోంది. గడిచిన 35 ఏళ్లలో 28 ఐఎంఎఫ్ కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి మౌలిక సంస్కరణలూ జరగలేదని తెలిపింది. పాకిస్థాన్.. భారత్‌పై దాడి చేస్తున్న వేళ ఐఎంఎఫ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆరోపించారు. పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయం చేయడమంటే.. యుద్ధానికి ఆయుధాలు ఇవ్వడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు కూడా తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని, ఆయా దేశాలు ఇంకా తమ నోరు మూయించలేవని పేర్కొన్నారు. తమ దేశ పౌరుల కంటే ఏదీ ఎక్కువకాదని జైశంకర్ తేల్చి చెప్పారు.



Next Story

Most Viewed