మైనర్లను పెళ్లాడిన 2,170 మంది అరెస్ట్.. ఓవైసీ ఆగ్రహం!

by Disha Web Desk 2 |
మైనర్లను పెళ్లాడిన 2,170 మంది అరెస్ట్.. ఓవైసీ ఆగ్రహం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మైనర్లను వివాహం చేసుకున్న వ్యక్తులపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 14 ఏళ్ల లోపు వయసున్న బాలికలను వివాహం చేసుకున్న వారికి పోక్సో చట్టం కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించనున్నట్లు హిమంత ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా మైనర్ బాలికలను వివాహం చేసుకున్న 2,170 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో 52 మంది ఖాజీలు కూడా ఉన్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై ఇవాళ స్పందించిన ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాల్య వివాహాలపై ప్రభుత్వం తాజా అణిచివేత మతపరమైనదని ఆరోపించారు. ప్రభుత్వం మైనర్లను వివాహం చేసుకున్నారనే కారణంతో వారి భర్తలను అరెస్ట్ చేస్తారు. కానీ వారి భార్యలను, కుటుంబ సభ్యుల బాగోగులు ఎవరు చూస్తారు? సీఎం చూసుకుంటారా అని ప్రశ్నించారు. గత ఆరేళ్లుగా బీజేపీనే అధికారంలో ఉందని అలాంటప్పుడు మైనర్ వివాహాలను ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు. రాష్ట్రం ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిందా అని నిలదీశారు. పార్లమెంట్ సెన్షన్ పై స్పందించిన ఓవైసీ పార్లమెంట్ పని చేయకపోతే బీజేపీ ప్రభుత్వం లాభపడుతుందని, బీజేపీ లోపాలను బయటడానికి వీలు లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు.


Next Story