మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి: ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతి

by Dishanational2 |
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి: ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం తెల్లవారుజామున బిష్ణుపూర్ జిల్లాలోని నరస్ సేన్ ప్రాంతంలో కుకీ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించగా..మరో నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. కుకీ కమ్యూనిటీకి చెందిన మిలిటెంట్లు అర్ధరాత్రి 12:45 నుంచి 2:15 గంటల మధ్య కొండపై నుంచి కాల్పులు జరిపినట్టు మణిపూర్ పోలీసులు వెల్లడించారు. మిలిటెంట్లు బాంబులు కూడా విసిరినట్టు తెలిపారు. మరణించిన సైనికులను సీఆర్‌పీఎఫ్ ఎస్సై సాకర్, హెడ్ కానిస్టేబుల్ అరూప్ సైనీలుగా గుర్తించారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో భారీ కూంబింగ్ నిర్వహించినట్టు తెలిపారు.

బిష్ణుపూర్ జిల్లా ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ జరగగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇందులో ముగ్గురికి గాయాలయ్యాయి. అనంతరం 22న రాష్ట్రంలోని లువాంగ్‌సనోల్ సెక్‌మైలో కుకీ, మైతీ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అంతకుముందు ఫిబ్రవరి15న చురాచంద్ పూర్ జిల్లాలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పోలీసు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ సుమారు 300 మంది ఎస్పీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి తర్వాత శాంతియుత పరిస్థితులు నెలకొన్నట్టు కనిపించినా తాజా దాడితో మరోసారి ఆందోళన నెలకొంది.

కాగా, గతేడాది మే 3 నుంచి రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య నిరంతరం కాల్పులు, దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 200మందికి పైగా మరణించగా..1100 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 65,000 మంది నిరాశ్రయులైనట్టు తెలుస్తోంది. తమకు కూడా తెగ హోదా ఇవ్వాలని మైతీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed