మరో ఆప్‌ నేతపై సీబీఐ విచారణ.. కేంద్రం ఆదేశం

by Dishanational4 |
మరో ఆప్‌ నేతపై సీబీఐ విచారణ.. కేంద్రం ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న ఆప్ నేత, రాష్ట్ర మాజీ హోం మంత్రి సత్యేంద్ర జైన్‌‌పై కేంద్ర సర్కారు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పిస్తామనే హామీ ఇచ్చి ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ నుంచి సత్యేంద్ర జైన్‌‌ రూ.10 కోట్ల ముడుపులు అందుకున్నారనే అభియోగంపై సీబీఐ విచారణకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఈ ప్రతిపాదనకు శుక్రవారం ప్రభుత్వ ఆమోదం లభించింది. ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ కూడా ప్రస్తుతం తీహార్ జైలులోనే ఉన్నాడు.

సుఖేష్ చంద్రశేఖర్‌తో సత్యేంద్ర జైన్‌కు లింక్ ఏమిటి ?

గతంలోకి వెళితే.. వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడటం ద్వారా సుఖేష్ చంద్రశేఖర్ వందల కోట్ల రూపాయలు కూడబెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. అయితే అతడు ఢిల్లీలోని తీహార్ జైలులోనూ లగ్జరీ లైఫే గడపాలని డిసైడయ్యాడు. ఇందుకోసం కీలకమైన వ్యక్తులకు భారీ ముడుపులు ముట్టజెప్పాడు. ఆ విధంగా సుఖేష్ చంద్రశేఖర్ నుంచి ముడుపులు అందుకున్న వ్యక్తుల్లో ఒకరే.. ఆనాటి ఢిల్లీ హోం మంత్రి, ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్‌‌! తీహార్ జైలు అధికారులను మేనేజ్ చేసి, జైలులో తన లగ్జరీ లైఫ్‌కు ఎవరూ అడ్డురాకుండా చూసేందుకుగానూ 2018 నుంచి 2021 మధ్యకాలంలో సత్యేంద్ర జైన్‌‌‌కు పలు వాయిదాల్లో రూ.10 కోట్లను సుఖేష్ చంద్రశేఖర్ ఇచ్చాడనే ఆరోపణ ఉంది. సత్యేంద్ర జైన్, తీహార్ జైలుమాజీ డీజీ సందీప్ గోయెల్ లంచాలకు రుచి మరిగి.. జైలు నిబంధనావళికి భిన్నంగా సుఖేష్‌కు అనేక సౌకర్యాలను కల్పించేవారని దర్యాప్తులో వెల్లడైంది. చివరకు 2022 సంవత్సరం మే నెలలో సత్యేంద్ర జైన్‌‌‌‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. దీనిపై గతంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు అందింది. లెఫ్టినెంట్ గవర్నర్‌ సక్సేనా సిఫారసు మేరకు ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం పచ్చజెండా ఊపింది. తన నుంచి ముడుపులు పుచ్చుకున్న వారి వివరాలను సుఖేష్ చంద్రశేఖర్ గతంలో పలుమార్లు వెల్లడించాడు. ఆ లిస్టులో సత్యేంద్ర జైన్ పేరు కూడా ఉంది.



Next Story

Most Viewed