‘మ్యావ్‌ మ్యావ్‌’ కలకలం.. రూ.300 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

by Dishanational4 |
‘మ్యావ్‌ మ్యావ్‌’ కలకలం.. రూ.300 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
X

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్‌ ల్యాబ్‌లను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) చేధించింది. ఈ ల్యాబ్‌ల నుంచి దాదాపు 300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. ఎన్‌సీబీ, గుజరాత్‌ పోలీసుశాఖకు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం (ఏటీఎస్‌) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌‌లో ఈ ల్యాబ్‌ల గుట్టురట్టయింది. రాజస్థాన్‌లోని జలోర్‌, భీన్‌మల్‌, జోధ్‌పుర్‌ జిల్లాల్లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్‌ తయారీ ల్యాబ్‌లను అధికారులు గుర్తించారు. దాదాపు మూడు నెలల పాటు నిఘా వేసి ఉంచి.. ఈ డ్రగ్‌ మాఫియా గుట్టును రట్టు చేశారు. ఈ ప్రాంతంలోని మూడు ల్యాబ్‌ల నుంచి దాదాపు 149 కిలోల ‘మ్యావ్‌ మ్యావ్‌’ (మెఫిడ్రోన్), 50 కిలోల ఎఫిడ్రిన్‌, 200 లీటర్ల అసిటోన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ల్యాబ్‌లతో సంబంధమున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇదే వ్యవహారానికి సంబంధించి గుజరాత్‌లోని అమ్రేలిలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ నెట్‌వర్క్‌కు ప్రధాన సూత్రధారిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలో నిందితుడిని అరెస్టు చేస్తామని తెలిపారు.



Next Story

Most Viewed