మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా దళంలో చీలిక.. మరో రెండు రోజుల్లో కీలక పరిణామం!

by Prasad Jukanti |   (  Updated:2026-05-09 09:20:59  IST  )

జార్ఖండ్‌లో మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా దళంలో విభేదాలు తలెత్తాయన్న ప్రచారం కలకలం రేపుతోంది.

మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా దళంలో చీలిక.. మరో రెండు రోజుల్లో కీలక పరిణామం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీని (Maoist Party) తీవ్రంగా నష్టపరిచిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ కారణంగా ఇప్పటికే అనేక మంది అగ్రనేతలు లొంగిపోగా మిగిలిన మరికొందరి కోసం భద్రతా దళాలు గురి పెట్టాయి. ముఖ్యంగా జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా సారండా అటవీ ప్రాంతంలో మిగిలిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గత కొంత కాలంగా కూంబిగ్ నిర్వహిస్తూనే ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా (Misir Besra) లక్ష్యంగా భారీ సెర్చ్ ఆపరేషన్ నడుస్తున్న వేళ మిసిర్ బిస్రా దళంలో చీలిక ఏర్పడిందనే ప్రచారం సంచలనంగా మారింది. వివిధ కారణాలతో బెస్రా టీమ్‍లో ఏర్పడిన విబేధాల వల్ల పలువురు మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారని, మరో రెండు మూడు రోజుల్లో వీరు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

చెల్లాచెదురైన సారణ్ణ దళాలు:

భద్రతా దళాలు సారణ్ణ అడవుల్లో చేపట్టిన భారీ ఆపరేషన్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తీసినట్లు తెలుస్తోంది. మిసిర్ బెస్రాకు అత్యంత నమ్మకస్తులైన తొమ్మిది మంది సభ్యుల దళం సారణ్ణ వదిలి కొల్హాన్ ప్రాంతానికి తరలిపోయాయాయని ఇందులో సాలుకా కాయమ్, రాహత్, చందన్ లోహ్రా వంటి కీలక సభ్యులు ఉన్నట్లు సమాచారం. కొల్హాన్ గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన ఘటన తర్వాత భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో కీలక నేత ఇజ్రాయిల్ మరణించగా, సాగిన్ అంగారియా గాయపడ్డారని, పలువురు మావోయిస్టులు ఆయుధాలు, సామగ్రి వదిలేసి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌, ఇజ్రాయిల్ మరణంతో మొత్తం కొల్హాన్ ప్రాంతంలో మావోయిస్టుల పట్టును పూర్తిగా బలహీనపరిచినట్లు చెబుతున్నారు. దీంతో కొల్హాన్ ప్రాంతం పూర్తిగా నక్సల్స్‌ రహితంగా మారే దిశగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్ కౌంటర్ దెబ్బకు పలువురు మావోయిస్టులు లొంగిపోబోతున్నట్లు తెలుస్తోంది.

బెస్రా టీమ్‍లో విభేదాలు:

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోయేందుకు నిర్ణయించుకోగా మిసిర్ బెస్రా ఆధ్వర్యంలో మరికొందరు లొంగుబాటును వ్యతిరేకించి అడవుల్లో ఉండిపోయినట్లు తెలుస్తోంది. అజయ్ మహతో వంటి బలమైన సభ్యులు బెస్రా టీమ్‍ను విడిపోయే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. బెస్రా వెంట అసీమ్ మండల్, సచిన్ మాండీ వంటి కొద్దిమంది నేతలు మాత్రమే అడవుల్లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సంస్థాగతంగా పెరుగుతున్న విభేదాలు మావోయిస్టు పార్టీని మరింత బలహీనపరుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టులకు మద్దతు కూడా తగ్గిపోవడంతో మిసిర్ బెస్రా త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటారా లేక సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story