ఢిల్లీలో మావోయిస్టు అగ్రనేత గణపతి సరెండర్..! అమిత్ షా, రేవంత్ ఎదుట ప్రవేశపెట్టే చాన్స్?

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-04 15:48:20  IST  )

మావోయిస్టు అగ్రనేత గణపతి దేశ రాజధాని ఢిల్లీలో లొంగిపోయినట్లుగా వస్తున్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపుతున్నాయి.

ఢిల్లీలో మావోయిస్టు అగ్రనేత గణపతి సరెండర్..! అమిత్ షా, రేవంత్ ఎదుట ప్రవేశపెట్టే చాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత ముప్పాళ లక్ష్మణరావు (Muppala Lakshmana Rao) అలియాస్ గణపతి (Ganapathi), దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. గణపతి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో ఆయనను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలని కేంద్రం విధించుకున్న గడువు సమీపిస్తున్న తరుణంలో, ఈ లొంగుబాటు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఢిల్లీలోనే తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు..

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy), స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్ ఐజీ బి.సుమతి (B Sumathi) ప్రస్తుతం ఢిల్లీలోనే ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. గత వారమే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి వంటి వారు లొంగిపోయిన నేపథ్యంలో, గణపతిని కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ పోలీసులు చేసిన చర్చలు సఫలమైనట్లు భావిస్తున్నారు.

నాలుగు దశాబ్దాలుగా అజ్ఙాత జీవితమే..

సుదీర్ఘకాలంగా అజ్ఞాత జీవితాన్ని గడిపిన గణపతి, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన ఆయనపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన పేరు భద్రతా దళాల హిట్‌లిస్ట్‌లో ఉంది.

అనారోగ్య కారణాలతోనే..

గత కొంతకాలంగా గణపతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందజేయాలన్న కుటుంబ సభ్యుల విన్నపం, అలాగే ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీల పట్ల ఆయన సానుకూలంగా స్పందించినట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే, దీనిపై ప్రభుత్వం లేదా పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ గణపతి లొంగుబాటు నిజమే అయితే.. భారత మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story