ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కుట్ర భగ్నం.. ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

by Ramesh Naini |   (  Updated:2025-05-19 10:09:18  IST  )

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లాలో (Maoist) మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కుట్ర భగ్నం.. ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రం గరియాబాద్ జిల్లాలో (Maoist) మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. కూంబింగ్ నిర్వహించే జవాన్లే లక్ష్యంగా (IED bombs) ఐఈడీ బాంబులు మావోయిస్టులు అమర్చినట్లు తెలుస్తోంది. అయితే వీటిని గుర్తించిన భద్రతా బలగాలు ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేశాయి. తాజాగా మెయిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌర్ముండ్ అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అడవుల్లో రెండు ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించి అక్కడికక్కడే నిర్వీర్యం చేశాయి. కాగా, గౌర్ముండ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. ఈ క్రమంలోనే నక్సల్స్ అమర్చిన ఐఈడీ బాంబులు ఉన్నట్లు భద్రతా దళాలు కనుగొన్నాయి. బలగాలు వాటిని ధ్వంసం చేశాయి. నక్సల్స్ అమర్చే ఐఈడీ బాంబులతో స్థానికంగా నివసించే గ్రామాలకు కూడా తీవ్ర ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.

కాగా, దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు ఆపరేషన్ కగార్ కేంద్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో విస్తరించిన అడవుల్లో బలగాలు తీవ్ర స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు తెలంగాణ సరిహద్దులో ప్రాంతంలోని కర్రిగుట్ట అడవుల్లో ప్రస్తుతం భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇక ఆపరేషన్ కగార్‌ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసి నక్సల్స్‌తో శాంతి చర్చలు జరుపాలని మానవ హక్కుల సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story