హైకోర్టులో కలకలం.. ప్రధాన న్యాయమూర్తి ఎదుట గొంతు కోసుకున్న వ్యక్తి

by Dishanational4 |
హైకోర్టులో కలకలం.. ప్రధాన న్యాయమూర్తి ఎదుట గొంతు కోసుకున్న వ్యక్తి
X

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎదుటే ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. సదరు వ్యక్తి కత్తితో గొంతు కోసుకోవడంతో కోర్టు ప్రాంగణంలో అలజడి ఏర్పడింది. హుటాహుటిన పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఆత్మహత్యకు ఎందుకు యత్నించాడు అనేది తెలియరాలేదు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది.పోలీసుల కథనం ప్రకారం.. మైసూరుకు చెందిన శ్రీనివాస్‌ బుధవారం కోర్టు హాల్లోకి ప్రవేశిస్తూనే సెక్యూరిటీ సిబ్బందికి ఓ ఫైల్‌ను అందజేశాడు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విపిన్‌ చంద్ర అంజరియా కళ్ల ఎదుటే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో హైకోర్టులో భద్రతా వైఫల్యంపై సీజే అసహనం వ్యక్తం చేశారు. కోర్టు భవనంలోకి ఆయుధాన్ని ఎలా తీసుకురాగలిగాడని పోలీసులను ప్రశ్నించారు. ఆధారాలను సేకరించాలని ఆదేశించారు. ఇంతకీ శ్రీనివాస్‌ తీసుకొచ్చిన ఫైల్లో ఏముంది ? అనేది ఇంకా వెల్లడికాలేదు. న్యాయవాది ద్వారా ఫైల్‌ ఇవ్వనందున అందులో ఉన్న పత్రాలను పరిశీలించబోమని హైకోర్టు సీజే తెలిపారు. కోర్టు ఆదేశం లేకుండా ఏ అధికారి కూడా ఆ ఫైల్‌ను చూడొద్దన్నారు. ఆరోగ్యం మెరుగుపడ్డాక పోలీసులు శ్రీనివాస్‌ నుంచి వాంగ్మూలం సేకరిస్తారని తెలుస్తోంది.



Next Story