టీతో గోమూత్రం.. భోజనంతో ఆవుపేడ.. దీదీ వివాదాస్పద వ్యాఖ్యలు

by Dishanational4 |
టీతో గోమూత్రం.. భోజనంతో ఆవుపేడ.. దీదీ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశ ప్రజలు ఏం తినాలి, ఏం తాగాలనేది కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ‘‘ప్రజల స్వేచ్ఛను హరించడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిగా మారింది. ఈసారి గెలిస్తే రోజూ ఉదయం టీతో పాటు గోమూత్రాన్ని తాగమంటారేమో.. మధ్యాహ్న భోజనంతో పాటు ఆవుపేడను తినమంటారేమో’’ అని దీదీ సెటైర్స్ వేశారు. బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 17న రామ నవమి సందర్భంగా అల్లర్లను ప్రేరేపించడానికి బీజేపీ యత్నిస్తోందని మమత ఆరోపించారు. రాష్ట్రంలోని సున్నిత ప్రాంతమైన ముర్షిదాబాద్‌లో డీఐజీ మార్పు వెనుక బీజేపీ హస్తం ఉందని చెప్పారు. ముర్షిదాబాద్, మాల్దాలలో ఒకవేళ అల్లర్లు జరిగితే ఆ బాధ్యతను ఎన్నికల కమిషనే తీసుకోవాలని దీదీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కచోట అల్లర్లు జరిగినా తాను 55 రోజుల పాటు ఈసీ కార్యాలయం వెలుపల నిరాహార దీక్ష చేస్తానని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ‘‘దేశ స్వాతంత్య్రాన్ని కాపాడాలంటే బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టాలి. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలు ఉండవు. వన్ లీడర్, వన్ నేషన్, వన్ భాషన్, వన్ భోజన్‌ను మోడీ కోరుకుంటున్నారు’’ అని తృణమూల్ సుప్రీం పేర్కొన్నారు. బెంగాల్‌ ఎన్నికల్లో దోస్తీ చేస్తున్న సీపీఎం, కాంగ్రెస్.. కేరళలో మాత్రం పరస్పరం కుస్తీ పడుతుండటం విచిత్రంగా ఉందని దీదీ కామెంట్ చేశారు. బీజేపీతో భాయ్ భాయ్ అన్నట్టుగా ఆ పార్టీల తీరు ఉందన్నారు.



Next Story

Most Viewed