Mamata Banerjee : ‘ఇండియా’ కూటమి చీఫ్‌గా మమతా బెనర్జీ?

by Sathputhe Rajesh |

అవసరమైతే ఇండియా కూటమి బాధ్యతలు చేపడతానని మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అలయెన్స్ పార్టీల్లో దుమారం రేపుతున్నాయి.

Mamata Banerjee : ‘ఇండియా’ కూటమి చీఫ్‌గా మమతా బెనర్జీ?
X

దిశ, నేషనల్ బ్యూరో : అవసరమైతే ఇండియా కూటమి బాధ్యతలు చేపడతానని మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అలయెన్స్ పార్టీల్లో దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో వరుస ఓటములుతో సతమతం అవుతున్న కూటమిని మమతా బలోపేతం చేస్తారని సమాజ్ వాదీ పార్టీ భావిస్తోంది. ఆర్జేడీ మాత్రం ఇండియా బ్లాక్‌ను నడిపించే సత్తా లాలూ ప్రసాద్ యాదవ్‌కే ఉందని అభిప్రాయపడింది. ఇదే అంశంపై సమాజ్ వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఉదయ్ వీర్ సింగ్ స్పందిస్తూ..‘మమతా బెనర్జీతో ఇండియా కూటమి నేతలు చర్చించి ఆమెకు వంద శాతం మద్దతు తెలపాలి. ఈ చర్యతో అలయెన్స్ మరింత బలోపేతం అవుతుంది. బెంగాల్‌లో బీజేపీని అడ్డుకోవడంలో మమతా సక్సెస్ అయ్యారు. కూటమిలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ మహారాష్ట్ర, హర్యానాలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో విఫలం అయింది. ఆశించిన ఫలితాలు రాలేదు కాబట్టి ఆ పార్టీయే ఓటమి బాధ్యత వహించాలి.’ అని ఆయన అన్నారు. సీపీఐ జనరల్ సెక్రటరీ డి. రాజా సైతం కాంగ్రెస్ పార్టీ‌పై ఫైర్ అయ్యారు. ‘కాంగ్రెస్ హర్యానా, మహారాష్ట్రల్లో కూటమి భాగస్వామ్యూలకు చోటు కల్పించలేదు. కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మిత్రపక్షాల మాటను కాంగ్రెస్ విని ఉంటే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు మరోలా ఉండేవి.’ అన్నారు. ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ మాత్రం పాట్నాలో నిర్వహించిన ఇండియా కూటమి తొలి సమావేశానికి చొరవ చేపిందే లాలూ ప్రసాద్ యాదవ్ అని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా నేతలు పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ అయితేనే కూటమికి రియల్ ఆర్కిటెక్ట్‌గా పనిచేయగలరని ఆయన అన్నారు.

Next Story