మా బోట్లను అడ్డగిస్తారా ? భారత్ వివరణ కోరిన మాల్దీవ్స్

by Dishanational4 |
మా బోట్లను అడ్డగిస్తారా ? భారత్ వివరణ కోరిన మాల్దీవ్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘ఇండియా ఔట్’ నినాదంతో ఎన్నికల్లో గెలిచి మాల్దీవుల అధ్యక్షుడైన మహ్మద్ ముయిజ్జు మొండి వైఖరితో భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారత సైన్యం మార్చిలోగా తమ దేశం నుంచి వెళ్లిపోవాలని అల్టిమేటం ఇచ్చిన మాల్దీవుల సర్కారు.. తాజాగా భారత సైన్యంపై ఓ ఆరోపణ చేసింది. మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక మండలిలోని హాలీఫు అటోల్‌ ప్రాంతానికి ఈశాన్యంగా 72 నాటికన్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో చేపల వేట చేస్తున్న మూడు మాల్దీవుల బోట్లను జనవరి 31న ఇండియన్ ఆర్మీ అడ్డగించిందంటూ భారత సర్కారుకు మాల్దీవుల విదేశాంగ శాఖ ఓ లేఖ రాసింది. దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని భారత్‌ను కోరింది. అంతర్జాతీయ సముద్ర చట్టాలను ఉల్లంఘిస్తూ.. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే భారత సైనికులు తమ ఫిషింగ్ బోట్లను అడ్డుకున్నారని మాల్దీవులు ఆరోపించింది. మాల్దీవుల ఫిషింగ్ బోట్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 246, 253 బోర్డింగ్ టీమ్స్ అడ్డుకోవడానికి గల కారణాలను తెలియజేయాలని డిమాండ్ చేసింది. జనవరి 31న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను మాల్దీవుల రక్షణశాఖ కూడా ధ్రువీకరించింది. కాగా, ప్రస్తుతం మాల్దీవుల్లో 80 మంది భారతీయ సైనికులు ఉన్నారు.

Next Story

Most Viewed