Kumbh Mela: మహకుంభమేళాలో భక్తుల రద్దీ.. మధ్యప్రదేశ్ సీఎం కీలక వ్యాఖ్యలు

by Shamantha N |

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో (Kumbh Mela) భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు అవుతున్నాయి.

Kumbh Mela: మహకుంభమేళాలో భక్తుల రద్దీ.. మధ్యప్రదేశ్ సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో (Kumbh Mela) భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు అవుతున్నాయి. అయితే, ట్రాఫిక్ జామ్స్, వాహనాల రద్దీ దృష్ట్యా.. రాబోయే రెండు రోజులపాటు ప్రయాగ్‌రాజ్ (Prayagraj) వైపు వెళ్లొద్దని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ యాత్రికులకు సూచించారు ‘‘ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో రివాంచల్‌తోపాటు ప్రయాగ్‌రాజ్‌కు సమీపంలోని జిల్లాల్లో వాహనాల రద్దీ పెరిగింది. మరో రెండురోజులు ఈ మార్గంలో వెళ్లవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గూగుల్‌లో చెక్ చేసుకొని.. రద్దీ లేకుంటే ముందుకు సాగాలి. ఆ మార్గంలో ఏమైనా ట్రాఫిక్‌ ఇబ్బందులుంటే అనువైన ప్రదేశంలో వేచి ఉండండి’’ అని ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ (CM Mohan Yadav) పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌కు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అయినప్పటికీ, వారి సురక్షిత ప్రయాణం, భద్రతపై ఆందోళన చెందుతున్నామని యాదవ్ అన్నారు. ప్రయాగ్ రాజ్ లోని యంత్రాంగంలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామన్నారు. భక్తులకు నీరు, ఆహారం పాటు ఇతర అత్యవసర సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.

ట్రాఫిక్ జాంలు

మరోవైపు, ప్రయాగ్‌రాజ్‌ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిపోతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌, సివనీ, కట్నీ, మైహర్‌, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు అవుతున్నాయి. దాదాపు 200-300 కి.మీ మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌లు ఉన్నట్లు ఎంపీ పోలీసులు తెలిపారు. 50 కి.మీ ప్రయాణించేందుకే 10 నుంచి 12గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాగ్ రాజ్ రద్దీ దృష్ట్యా మధ్యప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్ ను ఎక్కడికక్కడే నిలిపివేశారు. ఇలాంటి సమయంలో మధ్యప్రదేశ్ సీఎం ట్రాఫిక్ పై ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. కాగా.. కుంభమేళాలో రోజుకు 1.44 కోట్ల మంది సగటున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు అంచనా. ఇప్పటివరకు 45 కోట్ల మంది ప్రయాగ్ రాజ్ ను సందర్శించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.

Next Story