లివ్ ఇన్ రిలేషన్‌షిప్ తర్వాత బ్రేకప్‌పై సంచలన తీర్పు

by Dishanational4 |
లివ్ ఇన్ రిలేషన్‌షిప్ తర్వాత బ్రేకప్‌పై సంచలన తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : లివ్ ఇన్ రిలేషన్‌ షిప్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకోకున్నా.. పురుషుడితో చాలా కాలం పాటు జీవించిన స్త్రీకి, అతడి నుంచి విడిపోయాక భరణం పొందే హక్కు ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇద్దరి మధ్య సహజీవనం ఉందని రుజువైతే.. బాధిత మహిళకు ఉండే భరణం హక్కును తిరస్కరించలేమని తేల్చి చెప్పింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన శైలేష్ బోప్చే అనే వ్యక్తి ఓ మహిళతో చాలాకాలం పాటు సహ జీవనం చేశాడు. వారికి సంతానం కూడా కలిగింది. అనంతరం గొడవలతో ఇద్దరూ విడిపోయారు. దీంతో తనకు భరణం ఇప్పించాలంటూ బాధిత మహిళ స్థానికంగా ఉండే ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. సదరు మహిళతో శైలేష్ బోప్చే భర్తలాగా చాలాకాలం కలిసి జీవించాడన్న ట్రయల్ కోర్టు.. ఆమెకు ప్రతినెలా రూ.1500 భరణంగా చెల్లించాలని అతడిని ఆదేశించింది. ఈ తీర్పున సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన శైలేష్ బోప్చే.. తనకు సదరు మహిళతో పెళ్లి జరగలేదని వాదించాడు. ఆమెను తాను పెళ్లాడినట్లు ఎలాంటి రుజువు లేనప్పుడు, భరణం ఎందుకు చెల్లించాలని కోర్టును ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య సహజీవనం చాలాకాలం కొనసాగినట్లు రుజువైనందున.. భరణాన్ని తాము తిరస్కరించలేమని హైకోర్టు న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. కాగా, ఈ ఏడాది ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లు కూడా లివ్ ఇన్ రిలేషన్‌లను రిజస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది.



Next Story