LPG కొరత.. సిలిండర్ల లారీ దొంగతనం : రూ.17 లక్షల గ్యాస్ చోరీ!

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఏకంగా 524 గ్యాస్ సిలిండర్లతో ఉన్న లారీని దొంగలు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది.

LPG కొరత.. సిలిండర్ల లారీ దొంగతనం : రూ.17 లక్షల గ్యాస్ చోరీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లో తగినంత నిల్వలు ఉన్నాయని, ఎల్‌పీజీ (LPG) ఉత్పత్తిని 10 శాతం పెంచామని కేంద్రం భరోసా ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భయాందోళనలను ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఏకంగా 524 గ్యాస్ సిలిండర్లతో ఉన్న లారీని దొంగలు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది.

హోలీ సెలవులో ఉండగా దొంగతనం

ఝాన్సీలోని సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ భారీ చోరీ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నీరజ్ కుమార్ అగర్వాల్‌కు చెందిన ట్రక్కులు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్లాంట్ నుండి సిలిండర్లను రవాణా చేస్తుంటాయి. మార్చి 2వ తేదీన గ్వాలియర్ రోడ్డులోని ప్లాంట్ నుంచి 524 నిండుగా ఉన్న గ్యాస్ సిలిండర్లతో లోడ్ అయిన లారీ కాన్పూర్ దేహత్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, హోలీ పండుగ సందర్భంగా డ్రైవర్ రాజ్‌కుమార్ ఆ లారీని ప్లాంట్ బయట పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు.

జీపీఎస్‌ను ధ్వంసం చేసి.. ఖాళీగా వదిలేసి

మార్చి 6న యజమాని నీరజ్ అగర్వాల్ తన మొబైల్‌లో జీపీఎస్ ట్రాక్ చేయగా, ట్రక్కు ప్లాంట్ నుంచి కదులుతున్నట్లు గమనించారు. వెంటనే డ్రైవర్‌కు ఫోన్ చేయగా, తాను ఇంకా ఇంట్లోనే ఉన్నానని చెప్పడంతో యజమాని షాక్ అయ్యాడు. వెంటనే గాలించగా, కాన్పూర్ రోడ్డులోని పారీచా థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలో ట్రక్కు ఖాళీగా కనిపించింది. లారీలోని రూ. 17.35 లక్షల విలువైన 524 సిలిండర్లు మాయమయ్యాయి. దొంగలు ఆనవాళ్లు దొరకకుండా ట్రక్కులోని జీపీఎస్ పరికరాన్ని సైతం ధ్వంసం చేశారు.

రంగంలోకి ప్రత్యేక బృందాలు..

ఈ ఘటనపై బాధితుడు సీప్రి బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన 524 సిలిండర్ల విలువ సుమారు రూ. 17,35,051గా నిర్ధారించారు. దీనిపై బీపీసీఎల్ (BPCL) అధికారులు స్పందిస్తూ.. రవాణా బాధ్యత వహించే ట్రాన్స్‌పోర్టర్ పై డిమాండ్ నోటీసు జారీ చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సర్వైలెన్స్ ఆధారంగా దొంగల కోసం వేట మొదలుపెట్టారు. సిలిండర్లను వెతకడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్ఓ జై ప్రకాష్ చౌబే తెలిపారు. దేశంలో గ్యాస్ కొరత రాబోతుందన్న ప్రచారాల నేపథ్యంలో, ఇంత భారీ స్థాయిలో సిలిండర్లు చోరీకి గురికావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story