మూడోవిడత పోల్ బరిలో 244 మంది నేరచరితులు.. 392 మంది కోటీశ్వరులు

by Dishanational4 |
మూడోవిడత పోల్ బరిలో 244 మంది నేరచరితులు.. 392 మంది కోటీశ్వరులు
X

దిశ, నేషనల్ బ్యూరో : మూడోవిడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 95 స్థానాల్లో మే 7న జరగబోతోంది. ఇందులో మొత్తం 1,352 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వారిలో దాదాపు 244 మంది (18 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 172 మంది అభ్యర్థుల (13%)పై తీవ్రమైన క్రిమినల్ కేసులు, ఐదుగురిపై హత్య కేసులు, 38 మందిపై మహిళలపై అత్యాచారం సహా నేరాలకు సంబంధించిన కేసులు, 17 మంది అభ్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు ఉన్నాయి. పార్టీలవారీగా చూస్తే.. మూడో విడత ఎన్నికల బరిలో బీజేపీకి చెందిన 82 మంది అభ్యర్థుల్లో 22 మంది (27 శాతం)పై, కాంగ్రెస్‌కు చెందిన 68 మంది అభ్యర్థుల్లో 26 మంది (38 శాతం)పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. బిహార్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో ముగ్గురిపై (100 శాతం) కూడా కేసులు ఉన్నాయని పేర్కొంది. శివసేన (ఉద్ధవ్)కు చెందిన 80 శాతం మంది అభ్యర్థులపై, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( శరద్చంద్ర పవార్)కి చెందిన 67 శాతం అభ్యర్థులపై, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 50 శాతం అభ్యర్థులపై, జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన 33 శాతం అభ్యర్థులపై, తృణమూల్ కాంగ్రెస్‌‌కు చెందిన 17 శాతం మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయి. మూడోవిడతలో 95 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. 43 నియోజకవర్గాల్లో (45%) రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏదైనా లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కనీసం ముగ్గురిపై క్రిమినల్ కేసులున్న సందర్భాల్లో అక్కడ రెడ్ అలర్ట్‌ను జారీ చేస్తుంటారు.

392 మంది కోటీశ్వరులే..

మూడో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆర్థిక స్థితి విషయానికొస్తే.. 1,352 మంది అభ్యర్థులలో 392 మంది (29%) కోటీశ్వరులే ఉన్నారు. మూడోవిడతలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న 82 మంది అభ్యర్థుల్లో 77 మంది (94 శాతం) కోటీశ్వరులే. కాంగ్రెస్‌కు చెందిన 68 మంది అభ్యర్థులలో 60 మంది (88%) కోటీశ్వరులు ఉన్నారు.జేడీయూ, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ, ఆర్జేడీ, శివసేన (షిండే), ఎన్సీపీ (శరద్చంద్ర పవార్‌) పార్టీ అభ్యర్థులంతా కోటీశ్వరులే కావడం గమనార్హం. మూడో విడత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సగటు ఆస్తి రూ.5.66 కోట్లుగా ఉంది. అత్యధికంగా బీజేపీకి చెందిన 82 మంది అభ్యర్థుల ఆస్తుల సగటు రూ.44.07 కోట్లుగా ఉంది. 68 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ఆస్తుల సగటు రూ.20.59 కోట్లుగా ఉంది.

అత్యంత ధనిక అభ్యర్థి పల్లవి రూ.1361 కోట్లు

గోవాకు చెందిన బీజేపీ మహిళా అభ్యర్థి పల్లవి శ్రీనివాస్ డెంపోకు అత్యధికంగా రూ.1361 కోట్ల ఆస్తి ఉంది. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియాకు రూ.424 కోట్ల ఆస్తి, మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఛత్రపతి షాహూ షాహాజీకి రూ.342 కోట్ల ఆస్తి ఉంది. అయితే, ఐదుగురు అభ్యర్థులు తమకు అస్సలు ఆస్తులు లేవని ప్రకటించారు.

19 మంది నిరక్షరాస్య అభ్యర్థులు

విద్యార్హతల విషయానికొస్తే.. మూడో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న 591 మంది అభ్యర్థులు (44%) తాము గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువే చదివామని ప్రకటించారు. 44 మంది అభ్యర్థులు డిప్లొమా హోల్డర్లు, 639 మంది అభ్యర్థులు (47%) ఆరో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు చదువుకున్నవారు ఉన్నారు. 56 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులు. 19 మంది అభ్యర్థులు తాము నిరక్షరాస్యులమని ప్రకటించారు.

మహిళా అభ్యర్థులు 123 మందే..

మూడోవిడత ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల్లో 123 మంది (9 శాతం) మాత్రమే మహిళలు. గరిష్ఠంగా 712 మంది అభ్యర్థులు 41-60 ఏళ్లలోపు వారు. 228 మంది అభ్యర్థులు 61-80 ఏళ్లలోపు వారు. ఒక అభ్యర్థి వయస్సు 84 సంవత్సరాలు. కాగా, లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్ ముగిసింది. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో జరిగింది. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 26న 89 నియోజకవర్గాల్లో జరిగింది.

Next Story

Most Viewed