17వ లోక్‌సభ ఘనత : 222 బిల్లులకు ఆమోదం.. 97 శాతం ఉత్పాదకత

by Dishanational4 |
17వ లోక్‌సభ ఘనత : 222 బిల్లులకు ఆమోదం.. 97 శాతం ఉత్పాదకత
X

దిశ, నేషనల్ బ్యూరో : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్కర్ ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 17వ లోక్‌సభకు ఇదే చివరి సమావేశం కావడం గమనార్హం. సెషన్ చివరి రోజున పార్లమెంటులో అయోధ్య రామ మందిర నిర్మాణ అంశంపై చర్చించారు. 17వ లోక్‌సభలో గత ఐదేళ్ల వ్యవధిలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ఓంబిర్లా తెలిపారు. సమావేశాల్లో చర్చల ద్వారా 97 శాతం ఉత్పాదకతను సాధించామన్నారు. ఈ లోక్‌సభ సెషన్‌లో 30 బిల్లులను ఆమోదించారు. గత తొమ్మిది రోజుల పార్లమెంటు సెషన్‌లో 116 అంశాలపై చర్చించామని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తెలిపారు. పార్లమెంటేరియన్ల 90 నక్షత్రాలు కలిగిన ప్రశ్నలకు, 960 నక్షత్రాలు లేని ప్రశ్నలకు సమాధానం లభించిందన్నారు. దీంతో ఈ సెషన్‌లో మొత్తం 137 శాతం ఉత్పాదకత నమోదైందని పేర్కొన్నారు. ‘‘మేం రాజ్యసభ 263వ సమావేశాన్ని ముగించాం. సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళే ముందు ఇది చివరి సెషన్’’ అని జగదీప్ ధన్కర్ రాజ్యసభను వాయిదా వేసే క్రమంలో చెప్పారు.

17వ లోక్‌సభ విశేషాలు

* ప్రస్తుత లోక్‌సభలో 70 ఏళ్లకు పైబడినవారు తక్కువే. అత్యధిక ఎంపీలు 40 ఏళ్లలోపువారే. సభ్యుల సగటు వయసు 54 ఏళ్లు.

* 25 ఏళ్ల 11 నెలల వయసులో లోక్‌సభకు ఎన్నికైన బిజూ జనతాదళ్‌ ఎంపీ చంద్రాణీ ముర్ము.. ప్రస్తుత సభలో అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు.

* సమాజ్ వాదీ పార్టీకి చెందిన 89ఏళ్ల షాఫిఖర్‌ రహ్మాన్‌ బర్క్‌ ఈసారి లోక్‌సభలో అతి పెద్ద వయస్కురాలు.

* ఈసారి లోక్‌సభలో 260 మంది ఎంపీలు తొలిసారి ఎన్నికైనవారే. గత లోక్‌సభతో పోలిస్తే.. మళ్లీ ఎన్నికైన వారి సంఖ్య కూడా పెరిగింది.

* 17వ లోక్‌సభలో దాదాపు 400 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు.

* ప్రస్తుత లోక్‌సభ ఎంపీల్లో 39 శాతం మంది రాజకీయాలు, సామాజిక సేవను వృత్తిగా చూపించారు. 38 శాతం మంది వ్యవసాయదారులు, 23 శాతం మంది వ్యాపారవేత్తలు ఉన్నారు.



Next Story

Most Viewed