LOC: ఎల్ఓసీ వద్ద ఉద్రిక్తత.. నిరంతరం పాక్ కవ్వింపు చర్యలు

by B.Srinivas |

ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తుండగా నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.

LOC: ఎల్ఓసీ వద్ద ఉద్రిక్తత.. నిరంతరం పాక్ కవ్వింపు చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తుండగా నియంత్రణ రేఖ(LOC) వెంబడి పాకిస్థాన్ (Pakisthan) కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నిరంతరం కాల్పులకు తెగపడుతూ కయ్యానికి కాలుదువ్వుతోంది. అమాయక ప్రజలే టార్గెట్‌గా ఫైరింగ్ జరుగుతోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో కొందరు బంకర్లలో ఆశ్రయం పొందుతుండగా, మరి కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పూంచ్ జిల్లాలో ప్రజల కోసం అధికారులు తొమ్మిది ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. వసతి, ఆహారం, వైద్య సహాయం వంటి అన్ని సేవలు అందిస్తున్నారు. అయితే పాక్ సైన్యం కాల్పులను భారత్ దీటుగా ఎదుర్కొంటుంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. దీంతో ఎల్ఓసీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

16 మంది మృతి

నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం అర్ధరాత్రి నుంచి జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16కు చేరుకోగా గాయపడిన వారి సంఖ్య 64కు చేరింది. కుప్వారా, ఉరి, బారాముల్లా సహా పలు ప్రాంతాల్లో పాక్ సైనికులు శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపారు. ఫైరింగ్ కారణంగా సామాన్య ప్రజల ఇండ్లు దెబ్బతిన్నాయి. ఎల్‌ఓసీకి ఆనుకుని ఉన్న బాలకోట్, మెంధార్, మంకోట్, కృష్ణ ఘాటి, గుల్పూర్, కెర్ని, పూంచ్ జిల్లా్లోనూ కాల్పులు జరిగినట్టు సమాచారం.

చైనా ఆయుధాలతో కాల్పులు !

ఎల్ఓసీ వెంబడి కాల్పులు జరుపుతున్న పాక్ చైనా తయారు చేసిన ఎస్ఎహ్-15 ఆర్టిలరీ గన్‌ను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తుపాకీ సాయంలోనే భారీ కాల్పులకు తెగపడుతోంది. అంతేగాక భారీ ఫిరంగి, మోర్టార్లను ఉపయోగించిందని, మన్కోట్, మెంధార్, థాండి కాస్సీ, పూంచ్ పట్టణంలోని డజన్ల కొద్దీ ఉన్న గ్రామాలు, జనసాంద్రత కలిగిన పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఓ అధికారి తెలిపారు. విచక్షణారహితంగా జరిగిన కాల్పుల కారణంగా, అనేక ఇళ్ళు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.

చొరబాటుకు కుట్ర

రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, పాకిస్థాన్ పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు కుట్ర పన్నుతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించాయి. దీంతో సరిహద్దుల్లో చొరబాట్లు జరిగే అవకాశం ఉందని కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. అయితే భారత్-పాకిస్తాన్ సరిహద్దులోనే గాక ఇతర దేశాలతో ఉన్న అన్ని సరిహద్దులలోనూ భారత్ అలర్ట్ అయింది. అక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది.

Next Story