Kejriwal : ధనవంతులకు రుణమాఫీ భారీ కుంభకోణం : ప్రధాని మోడీకి కేజ్రీవాల్ లేఖ

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-28 11:59:56  IST  )

Kejriwal : ధనవంతులకు రుణమాఫీ భారీ కుంభకోణం : ప్రధాని మోడీకి కేజ్రీవాల్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ మనుగడకు గుండె కాయ వంటి ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరిగే అసెంబ్లీ ఎన్నిక(Delhi Assembly Elections)ల్లో గెలిచి అధికారం నిలబెట్టుకునే క్రమంలో బీజేపీతో ముఖాముఖీ తలపడుతున్న ఆప్ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలతో ప్రచారం సాగిస్తునే కొత్త కొత్త ఎన్నికల వాగ్థానాలు..ఆసక్తికరమైన ప్రతిపాదనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు ఉచిత బస్సు పథకానికి తోడుగా ఉచిత మెట్రో పథకం అమలుకు కేంద్రం సగం సబ్సిడీ భరించాలని ప్రధాని మోడీకి లేఖ రాసిన కేజ్రీవాల్ తాజాగా బిలియనీర్ల రుణమాఫీ నిషేధానికి చట్టం తేవాలంటూ మరో లేఖ సంధించారు.

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం బిలియనీర్లు తీసుకున్న వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ సంపన్నులకు అనుకూలంగా వ్యవహరిస్తూ సామాన్యులకు నష్టం చేస్తుందని ఆరోపించారు. కోటీశ్వరుల రుణమాఫీని నిషేదించేలా దేశవ్యాప్తంగా ఒక చట్టా(Prohibition Act)న్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆయన ప్రధాని మోదీకి (PM Modi) లేఖ రాశారు. లేఖ అంశాలను ఆయన మీడియాకు వివరించారు. ధనవంతులకు రుణమాఫీ అనేది భారీ కుంభకోణం(Loan waiver for the rich is a huge scam)అని..దీనికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారి రుణాల మాఫీ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని గురించి లేఖలో పేర్కొన్నట్లుగా చెప్పారు.

కోటీశ్వరులు తీసుకున్న వేల కోట్ల రుణాల మాఫీతో సాధారణ ప్రజలు అధిక పన్ను భారాన్ని మోయలేకపోతున్నారని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం రుణాల మాఫీ ప్రక్రియతో బిలియనీర్లకు మాత్రం ప్రయోజనం చేకూరుతోందన్నారు. పౌరులు తమ జీతాల నుంచి సగాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తుంటే.. మోడీ ప్రభుత్వం మాత్రం ధనవంతులకు రుణాలు మాఫీ చేస్తోందని విమర్శించారు. సామాన్యులు తీసుకునే గృహ, వాహన ఇతర రుణాలను కేంద్రం ఎందుకు మాపీ చేయడం లేదని కేజ్రీవాల్ నిలదీశారు.

ఒకవేళ బిలియనీర్ల రుణమాఫీని ఆపితే.. సామాన్యులపై ఆదాయపు పన్ను, జీఎస్టీ రేట్ల భారాన్ని సగానికి తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ఆదాయపు పన్ను పరిమితిని రెట్టింపు చేయొచ్చని..నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తొలగించవచ్చని సూచించారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ధనికుల రుణమాఫీ అంశంపై కేజ్రీవాల్ గళమెత్తారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Next Story