- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడుగు పెడితే చంపేస్తాం : ప్రధాని మోడీకి బెదిరింపులు
ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామని సోషల్ మీడియాలో బెదిరింపుల పోస్టులు రావడం తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామని సోషల్ మీడియాలో బెదిరింపుల పోస్టులు రావడం తీవ్ర కలకలం రేపింది. మెల్ బోర్న్ మీట్స్ మోడీ కార్యక్రమంలో మోడీని చంపేస్తామని సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చినట్లుగా అక్కడి పోలీసులు ధృవీకరించారు. ఆ పోస్టు ఐపీ అడ్రస్ ను గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ఐపీ అడ్రస్ నుంచి ఎవరు ఈ బెదిరింపులకు పాల్పడ్డారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 9వ తేదీన మోడీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. ఆయనకు ముందస్తు స్వాగతం పలుకుతూ ఆస్ట్రేలియా ఇండియన్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆ పోస్టుకు కౌంటర్ గా నిందితులు బెదిరింపు పోస్టు పెట్టారు. దీంతో ఆస్ట్రేలియా ఫెడరల్ ఏజెన్సీ మోడీ పర్యటనకు మరింత భద్రతను కట్టుదిట్టం చేసే అవకాశం కనిపిస్తోంది.
ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ప్రధాని నరేంద్రమోడీ పలు దేశాల్లో పర్యటించనున్నారు. ఆరు రోజుల పర్యటనలో ఆయన ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూజిలాండ్ దేశాలను సందర్శించి ఆయా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రముఖ యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపద అయిన యోగ్యకర్తలోని 'ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని' (Prambanan Temple complex) ప్రధాని సందర్శించనున్నారు. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం.. ఇండోనేషియాలో శివుడికి అంకితం చేయబడిన అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం కావడం విశేషం.
ఇండోనేషియా పర్యటన ముగిసిన అనంతరం, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanese) ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూలై 8న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకుంటారు. జూలై 10 వరకు అక్కడే బస చేయనున్న ఆయన ఆస్ట్రేలియా ప్రధానితో కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, భద్రత మరియు ఆర్థిక సంబంధాల బలోపేతంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.






