- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"మహా" విషాదం.. రెండునెలల పసికందును ఎత్తుకెళ్లిన చిరుత
రెండునెలల పసికందును చిరుతపులి ఎత్తుకెళ్లి, దారుణంగా చంపిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. పాప శరీరభాగాలు చూసి తల్లి బోరున ఏడ్చింది.

దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా చోప్డా తాలూకాలో అత్యంత విషాదకరమైన సంఘటన వెలుగుచూసింది. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాలపై చిరుత పులుల దాడులు నివాసితులను వణికిస్తున్నాయి. తాజాగా మమల్డే గ్రామంలో నిద్రిస్తున్న రెండు నెలల పసికందును ఒక వన్యప్రాణి ఎత్తుకెళ్లి చంపేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నిద్రలో ఉండగానే మృత్యువు పంజా
గ్రామానికి చెందిన ఒక కుటుంబం తమ పశువుల సంరక్షణ కోసం వ్యవసాయ పొలంలోనే బస చేస్తోంది. బాధితురాలు తన రెండు నెలల ఆడబిడ్డతో కలిసి మంచంపై నిద్రిస్తుండగా ఈ దారుణం జరిగింది. తెల్లవారుజామున తల్లి నిద్రలేచి చూసేసరికి పక్కనే ఉండాల్సిన బిడ్డ కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకగా.. కొద్ది దూరంలోనే గోధుమ గడ్డి కుప్ప వద్ద బిడ్డకు సంబంధించిన శరీర భాగాలు కనిపించాయి. అది చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అన్నాసాహెబ్ ఘోలప్, తహసీల్దార్ భావుసాహెబ్ తోరట్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్ పాటిల్ తదితరులు పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఆధారాలను సేకరించింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఇది చిరుత పులి దాడేనని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై చోప్డా సిటీ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది.
పెరుగుతున్న చిరుత పులుల భయం
చోప్డా తాలూకాలో గత కొంతకాలంగా చిరుత పులుల సంచారం అధికమైంది. గతంలో అనేక పశువులపై దాడులు జరిగినప్పటికీ, ఇప్పుడు పసిపాప ప్రాణం పోవడంతో ప్రజల్లో ఆగ్రహం, ఆందోళన పెల్లుబుకుతున్నాయి. జనారణ్యంలోకి వస్తున్న వన్యప్రాణుల నుంచి తమకు రక్షణ కల్పించాలని, చిరుతను వెంటనే బంధించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.






