Rajouri: రాజౌరీలో మిస్టరీ మరణాలు.. వైద్యసిబ్బందికి సెలవులు రద్దు

by Shamantha N |

జ‌మ్ముక‌శ్మీర్‌ మిస్టరీ మరణాల నేపథ్యంలో వైద్యసిబ్బందికి సెలవులు రద్దు చేశారు. రాజౌరీ (Rajouri ) జిల్లాలో అంతుచిక్కని వ్యాధి (mysterious illness) ఆందోళన కలిగిస్తోంది.

Rajouri: రాజౌరీలో మిస్టరీ మరణాలు.. వైద్యసిబ్బందికి సెలవులు రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: జ‌మ్ముక‌శ్మీర్‌ మిస్టరీ మరణాల నేపథ్యంలో వైద్యసిబ్బందికి సెలవులు రద్దు చేశారు. రాజౌరీ (Rajouri ) జిల్లాలో అంతుచిక్కని వ్యాధి (mysterious illness) ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఆ వ్యాధి వల్ల 17 మంది చనిపోయారు. బాదాల్ గ్రామంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై కేంద్రం స్టడీ చేస్తోంది. మెడికల్‌ ఎమర్జెన్సీతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు (Doctors leaves cancelled). ఈ విషయాన్ని రాజౌరి ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ అమర్‌జీత్ సింగ్ భాటియా వెల్లడించారు. నెలన్నర వ్యవధిలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు చెప్పారు. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10 మంది వైద్య విద్యార్థులను రాజౌరీకి డిప్యూట్‌ చేసినట్లు వెల్లడించారు.

17 మంది మృతి..

కాగా, గతేడాది డిసెంబ‌ర్ 7 నుంచి బ‌దాల్ గ్రామంలో మూడు కుటుంబాల‌కు చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో అయిదు మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్నది. బాధితులు న్యూరో సంబంధిత ల‌క్షణాల‌తో బాధ‌ప‌డుతున్నట్లు గుర్తించారు. ఆ పేషెంట్లలో కేంద్ర నాడీ వ్యవ‌స్థతో పాటు మెద‌డు కూడా డ్యామేజ్ అవుతున్నట్లు ప‌సిక‌ట్టారు. లక్నోలోని ల్యాబ్ లో నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో దీనికి కారణం ఏదైనా ఇన్ఫెక్షన్, వైరస్ లేదా బ్యాక్టీరియా కాదని, టాక్సిన్ అని తేలిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ల‌క్నోలోని టాక్సికాల‌జీ ఇన్స్‌టిట్యూట్ నిర్వహించిన ప‌రీక్షల్లో.. మృతుల శ‌రీరాల్లో కాడ్మియం ఉన్నట్లు గుర్తించామ‌న్నారు. అయితే వారి శ‌రీరాల్లోకి కాడ్మియం మూల‌కం ఎలా ఎంట‌రైంద‌న్న కోణంలో విచార‌ణ సాగుతోంద‌న్నారు. బాధితుల నమూనాలలో కొన్ని న్యూరోటాక్సిన్లు కనుగొన్నాక నేర కోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో వారు 50 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించారని అధికారులు తెలిపారు. మరోవైపు, మృతుల‌తో కాంటాక్టులోకి వ‌చ్చిన సుమారు 230 మందిని క్వారెంటైన్ చేశారు. రాజౌరీలోని ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీలో వాళ్లను క్వారెంటైన్ చేశారు.

Next Story