పార్లమెంటు చట్టాన్ని సొలిసిటర్ జనరలే వ్యతిరేకిస్తే ఎలా ?: సుప్రీంకోర్టు

by Dishanational4 |
పార్లమెంటు చట్టాన్ని సొలిసిటర్ జనరలే వ్యతిరేకిస్తే ఎలా ?: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)కి మైనారిటీ హోదాపై బుధవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఎంయూకు మైనారిటీ హోదాను కల్పిస్తూ సాక్షాత్తూ పార్లమెంటు 1981లో చేసిన చట్ట సవరణకు తాను వ్యతిరేకమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘పార్లమెంట్ అనేది శాశ్వతమైనది. కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా.. పార్లమెంటు ఉనికి మాత్రం చెక్కుచెదరదు. ఏఎంయూకు మైనారిటీ హోదాను కల్పిస్తూ 1981లో చట్టసవరణ చేసింది పార్లమెంటే. ఇప్పుడు పార్లమెంటులోని అధికార పక్షానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ .. ఆనాటి పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు. ‘‘పార్లమెంటు గతంలో తీసుకున్న నిర్ణయాలను గౌరవించనని సొలిసిటర్ జనరల్ లాంటి హోదాలో ఉన్న న్యాయాధికారి చెప్పడం అనేది ర్యాడికల్ భావనగా పరిగణించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం అంతగా అవసరమైతే మళ్లీ చట్ట సవరణను చేయొచ్చు. అంతే తప్ప పార్లమెంటు పాత నిర్ణయాలను ప్రభుత్వ న్యాయాధికారి బహిరంగంగా వ్యతిరేకించడం సబబు కాదు’’ అని ఆయన సూచించారు.

సొలిసిటర్ జనరల్ బదులిస్తూ..

దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘‘అలా అయితే ఎమర్జెన్సీ టైంలో మనదేశంలో జరిగిన రాజ్యాంగ సవరణలన్నీ సరైనవే అని న్యాయాధికారులు చెప్పాలని మీరు భావిస్తున్నారా ?’’ అని ప్రశ్నించారు. దీనికి సీజేఐ బదులిస్తూ.. ‘‘ ఇలాంటి సమస్యలను తొలగించేందుకు, అధిగమించేందుకే 44వ రాజ్యాంగ సవరణ చేశారు’’ అని గుర్తు చేశారు. ‘‘పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం తాలూకు ప్రాతిపదికపై న్యాయాధికారి అభ్యంతరం తెలపొచ్చు. కానీ కోర్టు తీర్పును నేరుగా తిరస్కరించలేరు’’ అని చెప్పారు. ఏఎంయూకు మైనారిటీ హోదాను రద్దు చేస్తూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 1968లో ఇచ్చిన తీర్పు చెల్లుబాటును పరిశీలించాలని దాఖలైన పిటిషన్లపై ఐదో రోజు(బుధవారం) విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం.. మైనారిటీ సంస్థగా హక్కులను క్లెయిమ్ చేయడానికి ఏఎంయూకు అర్హత లేదు. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 30 నుంచి న్యాయస్థానం కొనసాగించనుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed