సిసోడియాకు ఐదు రోజుల ఈడీ కస్టడీ

by Dishanational1 |
సిసోడియాకు ఐదు రోజుల ఈడీ కస్టడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు ఐదు రోజుల ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ నెల 22న తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. ఇప్పటికే అనుమతించిన వారం రోజుల కస్టడీ ముగియడంతో స్పెషల్ జడ్జి నాగ్‌పాల్‌ ముందు ఈడీ హాజరుపరిచింది. మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హొస్సేనీ స్పెషల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

14 మొబైల్ ఫోన్లు మార్చారు

లిక్కర్ స్కామ్‌లో సిసోడియా నుంచి చాలా వివరాలను రాబట్టినా ఇంకా వెలుగులోకి తీసుకురావాల్సినవి ఉన్నాయని, అందువల్లనే మరోమారు కస్టడీకి అప్పగించాలని కోరాల్సి వస్తున్నదన్నారు. ఎక్సయిజ్ ముసాయిదా పాలసీకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆమోదం పొందిన తర్వాత ఆ శాఖ మంత్రిగా మనీశ్ సిసోడియా ఏడాది కాలంలో 14 మొబైల్ ఫోన్లు మార్చారని, అందులోని డిజిటల్ ఎవిడెన్సులు ఉద్దేశపూర్వకంగానే ధ్వంసమయ్యాయని కోర్టుకు వివరించారు. ఫోన్లు, సిమ్ కార్డు ఆయన పేరు మీద లేవని తెలిపారు. సిసోడియా వాడిన ఫోన్లలో ఎక్కువగా దేవేందర్ శర్మ, సుధీర్ కుమార్, జావేద్ ఖాన్‌ల పేర్లతో కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు.

1.23 లక్షల మెయిల్స్

లిక్కర్ పాలసీకి సంబంధించి సిసోడియా ఇన్/ఔట్ బాక్సులో సుమారు 1.23 లక్షల మెయిల్స్ ఉన్నాయని, ఇప్పటికే వాటిని సీబీఐ తీసుకున్నదని, వాటిని త్వరలోనే తాము తీసుకుంటామని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్న విజయ్ నాయర్ సౌత్ గ్రూపునకు మీడియేటర్‌గా వ్యవహరిస్తూ జరిపిన చర్చల వివరాలను కూడా సేకరించాల్సి ఉన్నదన్నారు. సిసోడియా తరఫున హాజరైన న్యాయవాది మోహిత్ మాథుర్ వాదిస్తూ... వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నా ఇంకా వివరాలను రాబట్టాలని వాదించడం అర్థరహితమన్నారు. సీబీఐ తరహా దర్యాప్తు జరుగుతున్నదని ఆరోపించారు. ఈడీ న్యాయవది జోహెబ్ హొస్సేనీ స్పందిస్తూ, రోజుకు కేవలం నాలుగైదు గంటలు మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు. అన్ని వాదనలను పరిగణనలోకి తీసుకున్న జడ్జి ఎంకే నాగ్‌పాల్.. ఐదు రోజుల పాటు సిసోడియాను ఈడీ కస్టడీకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 22న తిరిగి ఆయనను కోర్టులో హాజరుపర్చాలన్నారు.

Next Story

Most Viewed