లాలూ దంపతులకు జడ్‌-ప్లస్‌ భద్రత ఉపసంహరణ.. ఇంటి ముందు కర్రలతో ఆర్జేడీ శ్రేణుల కాపలా!

by Ramesh Naini |

బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవికి రాష్ట్ర ప్రభుత్వం జడ్-ప్లస్ (Z-plus) భద్రతను ఉపసంహరించింది.

లాలూ దంపతులకు జడ్‌-ప్లస్‌ భద్రత ఉపసంహరణ.. ఇంటి ముందు కర్రలతో ఆర్జేడీ శ్రేణుల కాపలా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవికి రాష్ట్ర ప్రభుత్వం జడ్-ప్లస్ (Z-plus) భద్రతను ఉపసంహరించింది. ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర అసహనానికి గురైన లాలూ కుటుంబం, తమకు ప్రత్యామ్నాయంగా కల్పించిన భద్రతను సైతం ససేమిరా వద్దంటూ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో లాలూ నివాసం వద్ద ఆర్జేడీ కార్యకర్తలు కర్రలు చేతబూని కాపలా కాస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రత్యామ్నాయ భద్రతను వెనక్కి పంపిన లాలూ

రాష్ట్రంలోని వీఐపీల భద్రతపై ఇటీవల సమీక్ష నిర్వహించిన బిహార్ ప్రభుత్వం, లాలూ దంపతులకు ఉన్న అత్యున్నత జడ్-ప్లస్ కేటగిరీ భద్రతను తొలగించింది. దానికి బదులుగా బిహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ (BSAP), పాట్నా జిల్లా ఫోర్స్ నుంచి భద్రతా సిబ్బందిని, పైలట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. అయితే, ప్రభుత్వం కల్పించిన ఈ భద్రత తమకు వద్దంటూ పాట్నాలోని 10, సర్క్యులర్ రోడ్ నివాసం నుంచి ఆ సిబ్బందిని లాలూ కుటుంబం వెనక్కి పంపించేసింది. మరోవైపు, లాలూ కుమారుడు, శాసనసభ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా తనకు కల్పించిన ‘వై’ (Y) కేటగిరీ భద్రతను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ భద్రతను కూడా ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

ఉద్దేశపూర్వకంగానే భద్రత తగ్గింపు: రోహిణి ఆచార్య

భద్రత తగ్గింపుపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘మా తల్లిదండ్రులకు, కుటుంబానికి హాని తలపెట్టాలనే దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నామమాత్రపు భద్రత ఉంచుకోవడం వృథా అని భావించే రబ్రీదేవి భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారు’ అని ఆమె ‘ఎక్స్’ (X) వేదికగా పేర్కొన్నారు. యాదవ్ కుటుంబానికి నిజమైన రక్షకులు కార్యకర్తలేనని, వారంతా తమ నివాసం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి గట్టి సందేశం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. దీంతో ఆర్జేడీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కర్రలతో కాపలా కాస్తున్నారు. భవిష్యత్తులో మరికొందరు పార్టీ నేతలు కూడా తమ భద్రతను వెనక్కి ఇచ్చే అవకాశం ఉందని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ తెలిపారు.

బంగ్లా ఖాళీ చేయబోనన్న రబ్రీదేవి

మరోవైపు, 10, సర్క్యులర్ రోడ్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ఇటీవల అధికారులు రబ్రీదేవికి నోటీసులు ఇచ్చారు. మే 27న భవన నిర్మాణ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఈ బంగ్లాను పాడి, మత్స్య శాఖ మంత్రి నంద్ కిషోర్ రామ్‌కు కేటాయించారు. అయితే, బంగ్లాను ఖాళీ చేసేందుకు రబ్రీదేవి నిరాకరించారు. ‘ముఖ్యమంత్రి అయ్యాక సామ్రాట్ చౌదరి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లున్నారు. దమ్ముంటే ఆయన ప్రభుత్వం నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి గెంటెయ్యాలి. నేను మాత్రం ఈ ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు’ అని ఢిల్లీ పర్యటన నుంచి తిరిగొచ్చిన రబ్రీదేవి విలేకరులతో తేల్చి చెప్పారు.

Next Story