ఆపరేషన్ సిందూర్‌పై 32 గంటల డిబేట్: కిరణ్ రిజిజు

by Phanindra |

ఆపరేషన్ సిందూర్‌పై 32 గంటల డిబేట్ జరుగుతుందని, లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటలు చర్చిస్తామని కిరణ్ రిజిజు వెల్లడించారు.

ఆపరేషన్ సిందూర్‌పై 32 గంటల డిబేట్: కిరణ్ రిజిజు
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’పై 32 గంటలపాటు చర్చ జరగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సోమవారం నాడు లోక్‌సభలో 16 గంటలు, మంగళవారం నాడు రాజ్యసభలో 16 గంటలు ‘పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్’ అంశాలపై చర్చ జరగనుందని చెప్పారు.

‘లోక్‌సభలో సోమవారం నాడు పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది’ అని రిజిజు వెల్లడించారు. విపక్షాలు ఎన్నో సమస్యలు చర్చించాలని అనుకుంటున్నారని, అయితే వీటిలో ఆపరేషన్ సిందూర్‌ను ముందుగా చర్చించేందుకు అందరూ అంగీకరించారన్నారు.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవడానికి ముందే ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చలు నిర్వహించాలని విపక్షాలు లేఖలు రాశాయని, తాము కూడా దానికి సిద్ధమేనని ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తుచేశారు.

అయితే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్తున్నాయని, తొలి వారంలో కేవలం ఒక్క బిల్లు మాత్రమే ఆమోదం పొందిందని రిజిజు అసహనం వ్యక్తంచేశారు. నిబంధనలను అనుసరించి ఏ సమస్యపై అయినా విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తొచ్చని, అంతేకానీ సభను ఇలా అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు.

Next Story