కీలక పరిణామం.. “భారత్–చైనా డైరెక్ట్ ఫ్లైట్స్ మళ్లీ ప్రారంభం”

by Malleboina Mahesh |   (  Updated:2025-10-03 04:15:09  IST  )

భారతదేశం, చైనా దేశాలు ఐదు సంవత్సరాల విరామం తర్వాత నేరుగా విమాన సేవలను తిరిగి ప్రారంభించనున్నాయి.

కీలక పరిణామం.. “భారత్–చైనా డైరెక్ట్ ఫ్లైట్స్ మళ్లీ ప్రారంభం”
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశం, చైనా దేశాలు ఐదు సంవత్సరాల విరామం తర్వాత నేరుగా విమాన సేవల (Direct flight services)ను తిరిగి ప్రారంభించనున్నాయి. ఈ సేవలు అక్టోబర్ 26, 2025 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.. లడఖ్ ప్రాంతంలోని సరిహద్దులో 2020లో చోటుచేసుకున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో, రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారి తీయగా.. భారత్ చైనాతో నేరుగా విమాన సేవలను రద్దు చేసింది. అయితే తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తుంది. ఈ విమాన సేవలను మొదటగా భారత్‌కు చెందిన ఇండిగో (IndiGo), చైనాకు చెందిన చైనా ఈస్టర్న్ (China Eastern) అనే రెండు ఎయిర్‌లైన్స్‌లు ప్రారంభించనున్నాయి.

ఇటీవల చైనాలోని తియాంజిన్ నగరంలో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశ సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ విమాన సేవల పునఃప్రారంభం ద్వైపాక్షిక సంబంధాల్లో సానుకూల మార్పు కు సంకేతంగా భావించబడుతోంది. ఇది వ్యాపార, విద్య, పర్యటన తదితర రంగాల్లో రెండు దేశాల మధ్య పరస్పర సంబంధాలను మెరుగుపరచేందుకు దోహదపడనున్నట్లు, అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story