వీఐపీ ప్రయాణాల్లో సైరన్లు బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

by Phanindra |   (  Updated:2025-07-21 16:00:42  IST  )

వీఐపీ ప్రయాణాల్లో సైరన్లు బ్యాన్ చేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై పోలీసులు, అంబులెన్సులు, అగ్నిమాపక శాఖ, ఎమర్జెన్సీ సమయాల్లోనే సైరన్లు వాడాలని స్పష్టంచేసింది.

వీఐపీ ప్రయాణాల్లో సైరన్లు బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజాశ్రేయస్సు, శబ్దకాలుష్యాన్ని నియంత్రించేందుకు వీఐపీ మూవ్‌మెంట్ సమయంలో సైరన్లను బ్యాన్ చేస్తున్నట్లు కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఎంఏ సలీమ్ ప్రకటించారు. సైరన్లు ట్రాఫిక్‌ ఇబ్బందులు సృష్టించడంతోపాటు ప్రజలను తికమక పెడతాయని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దానికితోడు వీఐపీ కాన్వాయ్‌లు వెళ్లే మార్గాలను కూడా అందరికీ వెల్లడిస్తాయని, దీని వల్ల ఈ కాన్వాయ్‌లకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అలాగే ఎస్కార్ట్ వాహనాలు సరైన పద్ధతిలో వెళ్లకపోతే ప్రమాదాలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలోనే ఇకపై వీఐపీ మూవ్‌మెంట్‌కు సంబంధించిన అంశాలన్నీ కూడా సైరన్లకు బదులుగా వైర్‌లెస్ కమ్యూనికేషన్‌తో హ్యాండిల్ చేయాలని డీజీపీ సూచించారు. కేవలం అంబులెన్సులు, పోలీసులు, అగ్నిమాపక శాఖతోపాటు నిజంగా ఎమర్జె్న్సీ సమయాల్లో మాత్రమే సైరెన్లు ఉపయోగించాలని ఈ ఉత్తర్వులు స్పష్టంచేశాయి.

ఇలా చేయడం వల్ల వీఐపీ మూవ్‌మెంట్ మరింత భద్రంగా, గోప్యంగా, ప్రజలకు తక్కువ ఇబ్బందులు కలిగించేదిగా మారుతుందని అధికారులు చెప్తున్నారు. ఇటీవలే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెళ్తున్న కాన్వాయ్‌లో ఒక వాహనానికి ప్రమాదం జరిగి, నలుగురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కర్ణాటక డీజీపీ ఉత్తుర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Next Story