Defence: రూ.52,000 కోట్ల రక్షణ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్

by S Gopi |

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ సేకరణ మండలి (డీఏసీ) శుక్రవారం నాడు సుమారు రూ. 52,000 కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్లకు చారిత్రాత్మక ఆమోదం తెలిపింది.

Defence: రూ.52,000 కోట్ల రక్షణ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, నేషనల్ బ్యూరో: మారుతున్న అంతర్జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు, భారత సైనిక సామర్థ్యాలను మునుపెన్నడూ లేని విధంగా ఆధునీకరిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ సేకరణ మండలి (డీఏసీ) శుక్రవారం నాడు సుమారు రూ. 52,000 కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్లకు చారిత్రాత్మక ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్యాకేజీ ద్వారా మన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్పగించబోతున్నారు. దీని ప్రకారం, భారత సైన్యం కోసం శత్రువుల డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసే ‘ఆకాశ్ తరంగ్’ ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ, యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, శత్రు స్థావరాలపై ఆత్మాహుతి దాడులు చేయగల జెట్-శక్తితో నడిచే ‘కమికాజీ డ్రోన్లను’ కొనుగోలు చేయనున్నారు. అలాగే, భారత నేవీ శత్రు యుద్ధనౌకల కదలికలను సముద్రంలోనే కట్టడి చేసేలా అడ్వాన్స్‌డ్ ‘గ్రౌండ్ మైన్స్’ను, వాయుసేన నిరంతరం సరిహద్దులపై గూఢచర్యం, నిఘా పెట్టడానికి వీలుగా ఎక్కువ సేపు గాల్లోనే తేలగలిగే ‘హై-అల్టిట్యూడ్ సూడో శాటిలైట్లను’ రంగంలోకి దించబోతున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, స్వదేశీ రక్షణ తయారీని పెంచడమే ఈ కొనుగోళ్ల ప్రధాన లక్ష్యమని రక్షణ శాఖ తెలిపింది. డీఏసీ ఆమోదంతో ఈ ప్రతిపాదనలు ఇప్పుడు టెండర్లు, ఒప్పందాల దశలోకి ప్రవేశించనున్నాయి.

Next Story