- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎంకే కూటమికి మద్దతు.. అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న కమల్హాసన్
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపకుండా.. అధికార డీఎంకే (DMK) నేతృత్వంలోని కూటమికి ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్తో సమావేశమైన అనంతరం కమల్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తాజా పరిణామంతో డీఎంకే, ఎంఎన్ఎం పార్టీల మధ్య రాజకీయ బంధం మరింత బలపడింది.
కార్యకర్తల అభిప్రాయం మేరకే నిర్ణయం
సీఎం స్టాలిన్తో భేటీ అనంతరం కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బయట నుంచి డీఎంకే కూటమికి మేము చాలా బలంగా మద్దతు ఇస్తాం. ఈ ఎన్నికల్లో మా కూటమి విజయం తథ్యం. పార్టీ కార్యకర్తలకు నా లక్ష్యం ఏమిటో తెలుసు, వారు దానినే అనుసరిస్తారు. మేము మధ్యే వాదులం, ఎటువైపు వంగిపోము’ అని స్పష్టం చేశారు. అలాగే, ‘నా తాజా నిర్ణయం కొందరికి బాధ కలిగించవచ్చు, కానీ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా దృష్టిలో రాజకీయాలు వ్యాపారం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. డీఎంకే కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
రాజకీయ ప్రస్థానం.. రాజ్యసభ ఎంట్రీ
కాగా, అవినీతి నిర్మూలన, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రధాన అజెండాతో 2017 లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సుమారు 4 శాతం ఓట్లను సాధించి రాష్ట్ర రాజకీయాల్లో తొలిసారిగా ఉనికి చాటుకున్నారు. అయితే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో తృటిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా డీఎంకేకే మద్దతు ఇచ్చారు. కాగా, డీఎంకే మద్దతుతో ఆయన జూన్ 12న రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. తాజా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 234 స్థానాల్లో 44 ఎస్సీలకు, 2 ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా అధికార డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే (TVK) బరిలో ఉన్నాయి.






