రాహుల్ గాంధీ సీటుపై ఆయన బావ కన్నేశాడు.. స్మృతి ఇరానీ సెటైర్లు

by Dishanational1 |
రాహుల్ గాంధీ సీటుపై ఆయన బావ కన్నేశాడు.. స్మృతి ఇరానీ సెటైర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ ప్రధాన పార్టీల అభ్యర్థులు పలు కీలక అంశాలను లేవనెత్తి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అమేఠీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీని గురించి స్పందించిన ప్రస్తుత అమేఠీ ఎంపీ స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అమేఠీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మూడు పర్యాయాలు(15 ఏళ్లు) రాహుల్ గాంధీ చేసిన దానికంటే గత ఐదేళ్లలో తాను అమేఠీ నియోజకవర్గం కోసం చాలా ఎక్కువ పనిచేశానని చెప్పుకొచ్చారు. రాబర్ట్ వాద్రా పోటీ చేయనున్నారనే ప్రచారంపై స్పందిస్తూ.. 'జీజాజీ కీ నజర్ హై, సాలే సాబ్ క్యా కరేంగే..(బావ తన సీటు కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఆయన(రాహుల్ గాంధీ) ఏమి చేస్తారు? ఒకప్పుడు బస్సుల్లో ప్రయాణించే సమయంలో సీటు కోసం కర్చీఫ్ వేసేవారు. ఇప్పుడు రాహుల్ గాంధీ సైతం తన సీటు కోసం అదే చేయాలేమో.. 'అంటూ ఎద్దేవా చేశారు.

'ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఎన్నికలు జరిగేందుకు కేవలం 27 రోజులు మిగిలుంది. కానీ అమేఠీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇది అహంకారం కాదా' అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. అమేఠీలో మే 20న పోలింగ్ జరగనుంది. సిట్టింగ్ ఎంపీగా స్మృతి ఇరానీ వరుసగా రెండోసారి పోటీకి సిద్ధమయ్యారు. 2019కి ముందు ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ మూడుసార్లు విజయం సొంతం చేసుకున్నారు. అంతకుముందు సైతం సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ అమేఠీ నుంచే గెలుపొందారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ దక్కించుకుంటున్న ఈ నియోజకవర్గంపై గత ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టు కోల్పోయింది. ఈ ఓటమి కాంగ్రెస్‌ను మరింత కృంగదీసింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచే అభ్యర్థి నిలబడతారా? లేదా అనేది సందేహంగా మారింది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అమేఠీ అంశంపై అడిగినప్పుడు పార్టీ ఆదేశాలను అనుసరిస్తానని చెప్పారు.

తాజాగా, రాబర్ట్ వాద్రా దీని గురించి మాట్లాడుతూ.. స్మృతి ఇరానీని ఎన్నుకోవడం ద్వారా చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం కోసం ప్రజలు చూస్తున్నారన్న మాటలు సంచలనం రేపాయి. తాను అమేఠీ నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా, వయనాడ్‌లో ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనుండగా, అమేఠీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు మే 3 ఆఖరు తేది. అంటే వయనాడ్‌లో పోలింగ్ తర్వాత అమేఠీలో రాహుల్ పోటీపై స్పష్టత రావొచ్చు.



Next Story