JEE Main paper two results : జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన సౌత్ విద్యార్థులు

by Ramesh Naini |

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 సెషన్-1 పేపర్-2 ఫలితాలను ప్రకటించింది.

JEE Main paper two results : జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన సౌత్ విద్యార్థులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 సెషన్-1 పేపర్-2 ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో సౌత్‌కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది ఆర్కిటెక్చర్ (B.Arch), ప్లానింగ్ (B.Planning) విభాగాల్లో కేరళ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా ఇద్దరు విద్యార్థులు మాత్రమే 100 పర్సంటైల్ సాధించగా, ఆ ఇద్దరూ కేరళకు చెందిన వారే కావడం విశేషం. జనవరి 29న దేశవ్యాప్తంగా 426 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. అభ్యర్థులు తమ స్కోరు కార్డులను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

100 పర్సంటైల్ సాధించిన టాపర్లు వీరే..

సూర్య తేజస్ ఎస్ (Suryathejus S) పేపర్ 2A (B.Arch) విభాగంలో 100 పర్సంటైల్ సాధించి జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచారు. గౌరీశంకర్ వి (Gowri Sankar V) పేపర్ 2B (B.Planning) విభాగంలో 100 పర్సంటైల్ స్కోరుతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. మహిళా అభ్యర్థుల విభాగంలో కూడా దక్షిణాది విద్యార్థినులే పైచేయి సాధించారు. బీఆర్క్ (B.Arch)లో తమిళనాడుకు చెందిన నివందాతి వెంకటేశ్ 99.9955998 పర్సంటైల్‌తో మహిళా టాపర్‌గా నిలిచారు. బీ ప్లానింగ్ (B.Planning)లో ఏంజెల్ ఎం. ఫెబిన్ 99.9335454 పర్సంటైల్‌తో అగ్రస్థానంలో నిలిచారు.

సెషన్-2 రిజిస్ట్రేషన్‌కు రేపే ఆఖరు..

మరోవైపు, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే గడువు ఫిబ్రవరి 25, 2026 తో ముగియనుంది. ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 9 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 - 12, మధ్యాహ్నం 3 - 6) పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు గడువు ముగిసిన వెంటనే అప్లికేషన్ సవరణ (Correction Window) కోసం ఎన్‌టీఏ అవకాశం కల్పించనుంది.

Next Story