అదంతా మీడియా సృష్టించిందే: బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ క్లారిటీ

by Dishanational2 |
అదంతా మీడియా సృష్టించిందే: బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ క్లారిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బీజేపీలో చేరబోతున్నారంటూ ఇటీవల ఊహాగానాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కమల్‌నాథ్ క్లారిటీ ఇచ్చారు. నేను బీజేపీలో చేరబోతున్నాననే కథనాలన్నీ మీడియా సృష్టించినవే అని తేల్చి చెప్పారు. మంగళవారం ఆయన చింద్వారా జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. కాషాయ పార్టీలో జాయిన్ అవుతానని ఎటువంటి ప్రకటనలూ చేయలేదని తెలిపారు. తప్పుడు కథనాలు ప్రచురించడం మానుకోవాలని సూచించారు. వర్షాల వల్ల రాష్ట్రంలోని రైతులకు జరిగిన నష్టంపై స్పందిస్తూ..వారికి తగిన పరిహారం చెల్లించేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తానన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించడంతో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రుణాలపై ఆధారపడి మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. త్వరలోనే లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా, మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గియా ఇటీవల మాట్లాడుతూ బీజేపీకి కమల్‌నాథ్ అవసరం లేదని, ఆయన కోసం దాని తలుపులు మూసుకుపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కమల్‌నాథ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Next Story