మళ్లీ ఢిల్లీ బాట పట్టిన రైతులు

by Dishanational1 |
మళ్లీ ఢిల్లీ బాట పట్టిన రైతులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మొక్కజొన్న, పత్తి, మూడు రకాల పప్పు దినుసులను 5 ఏళ్ల పాటు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. దీంతో రైతులు కేంద్రంపై తమ నిరసనను మళ్లీ పునఃప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం, ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తిరస్కరించడంతో బుధవారం ఢిల్లీని ముట్టడిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. వివిధ రాష్ట్రాల సరిహద్దుల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ బాట పట్టారు. అయితే, రైతులను ఎక్కడికక్కడే అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్రను పునఃప్రారంభిస్తామని రైతులు చెప్పారు. 'మాపై బలప్రయోగం చేయవద్దని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాము. మేము శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకుంటున్నాం' అని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని, రెండు లేదా మూడు పంటలకు ఎంఎస్‌పీ తీసుకోవడం, మిగిలిన రైతులకు అన్యాయం జరగడం సమంజసం కాదని ఓ రైతు నాయకుడు అన్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల ఆందోళనపై పంజాబ్‌-హర్యానా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆందోళన చేసే హక్కు అందరికీ ఉందని, కానీ ప్రశాంతంగా నిరసనలు చేపట్టాలని రైతులను కోరింది. హైవేలపై ట్రాక్టర్లు, ట్రాలీలతో రైతులను అనుతించవవద్దని పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Next Story

Most Viewed