ఇరాన్-అమెరికా శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌లో రెడ్ అలర్ట్

by Malleboina Mahesh |

ఇరాన్-అమెరికా శాంతి చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో రెడ్ అలర్ట్! జెడి వాన్స్ బృందంతో కీలక భేటీ. 10 వేల మంది సైనికులతో భారీ భద్రత.

ఇరాన్-అమెరికా శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌లో రెడ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా ఇరాన్- అమెరికా దేశాల మధ్య పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదిక అయింది. ఈ క్రమంలో ఈ రోజు ఇరు దేశాల అత్యంత కీలకమైన శాంతి చర్చలకు సర్వం సిద్ధం చేశారు. . ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం రాజధాని నగరంలో 'రెడ్ అలర్ట్' ప్రకటించింది. చర్చలు జరగనున్న సెరెనా హోటల్, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న 'రెడ్ జోన్' ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సుమారు 10,000 మందికి పైగా పోలీసులు, పారా మిలటరీ, సైనిక దళాలను నగరం నలుమూలలా మోహరించి, ఇస్లామాబాద్‌ను ఒక అభేద్యమైన కోటలా మార్చారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే నగరంలో స్థానిక సెలవు ప్రకటించి, భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

శాంతి దిశగా ముందడుగు..

ఈ చర్చల్లో అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ (JD Vance) నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం పాల్గొంటోంది. ఇరాన్ ప్రతినిధులు కూడా ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకాలు తొలగించడం, రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవడం ఈ భేటీ ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి నుంచి ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణాన్ని తగ్గించి, శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఈ చర్చలు కీలకం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దౌత్యవేత్తలు మరియు ఆర్థిక నిపుణులు ఈ సమావేశం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story