పరిచయం.. ప్రేమ.. పెళ్లి.. నాలుగు నెలలకే కట్నం కోసం భార్యను చంపాడు

by Ramesh Naini |

ప్రేమించి ఒక్కటైన ఆ జంట కలకాలం కలిసి ఉంటారనుకుంటే.. పెళ్లయిన నాలుగు నెలలకే ఆ బంధం విషాదాంతమైంది.

పరిచయం.. ప్రేమ.. పెళ్లి.. నాలుగు నెలలకే కట్నం కోసం భార్యను చంపాడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమించి ఒక్కటైన ఆ జంట కలకాలం కలిసి ఉంటారనుకుంటే.. పెళ్లయిన నాలుగు నెలలకే ఆ బంధం విషాదాంతమైంది. వరకట్న దాహంతో కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా, విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపాడో భర్త. గురుగ్రామ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు తెలిపిన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ్ శర్మ రేడియాలజిస్ట్‌గా, కాజల్ నర్సుగా గురుగ్రామ్‌లోని ఓ నర్సింగ్ హోమ్‌లో పనిచేసేవారు. వృత్తిరీత్యా ఏర్పడిన పరిచయం కాస్తా కొన్నాళ్లకే ప్రేమగా మారింది. ఒకరి విడిచి ఒకరు ఉండలేనంతగా దగ్గరైన వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో ప్రేమ వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ, వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లయిన కొద్ది రోజులకే అరుణ్ అదనపు కట్నం, డబ్బులు తీసుకురావాలని కాజల్‌ను నిత్యం వేధించేవాడని ఆమె సోదరుడు తెలిపాడు. చిన్న చిన్న కారణాలకే భార్యపై భౌతిక దాడికి దిగేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు. హోలీ పండుగ సందర్భంగా (మార్చి 4న) ఈ దంపతులు గురుగ్రామ్‌లోని గర్హీ హర్‌సారులో ఉన్న కాజల్ పుట్టింటికి వచ్చారు. మార్చి 17న మద్యం సేవించిన అరుణ్.. కాజల్‌ను తీవ్రంగా కొట్టాడు. మరుసటి రోజు ఉదయం (మార్చి 18న) మాట్లాడాలని చెప్పి కాజల్‌ను కిందకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాసేపటికే కాజల్ ముక్కులోంచి రక్తం కారుతూ, అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

టాయిలెట్‌లో సిరంజి.. బయటపడ్డ నిజం!

కాజల్ ప్రాణాలు కోల్పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులకు టాయిలెట్‌లో వాడి పారేసిన ఓ సిరంజి కనిపించింది. అరుణ్ ఆమెకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి అరుణ్‌ను విచారించగా.. భార్యకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అరుణ్‌కి మత్తుపదార్థాలు (డ్రగ్స్) తీసుకునే అలవాటు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు..

పారిపోయేందుకు యత్నించిన నిందితుడు అరుణ్‌ను ఓ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశామని, మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తరలించనున్నట్లు గురుగ్రామ్ సెక్టార్ 10 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO) కుల్దీప్ సింగ్ వెల్లడించారు. కాగా, పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు.. మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపామని, ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే మరణానికి గల కచ్చితమైన కారణం శాస్త్రీయంగా నిర్ధారణ అవుతుందని పేర్కొన్నారు.

Next Story