ఆయుధాల నిల్వల ఆరోపణలు.. బెంగాల్ రాజ్ భవన్ లో తనిఖీలు

by Muthe.Rajitha |

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది.

ఆయుధాల నిల్వల ఆరోపణలు.. బెంగాల్ రాజ్ భవన్ లో తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాజ్‌భవన్ ప్రాంగణంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేశారంటూ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన గవర్నర్ సీవీ ఆనంద బోస్ సోమవారం రాజ్‌భవన్‌లో పోలీసులు, కేంద్ర బలగాలు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ తనిఖీలు నిర్వహించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా 'ప్రత్యేక సమగ్ర సవరణ' (ఎస్‌ఐఆర్) కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళనకు అవసరమని గవర్నర్ శనివారం వ్యాఖ్యానించిన గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ కల్యాణ్ బెనర్జీ "రాజ్‌భవన్ లోపల భాజపా నేరస్థులకు గవర్నర్ ఆశ్రయం కల్పించి వారికి బాంబులు, తుపాకులు సమకూర్చారు" అని తీవ్ర ఆరోపణలు చేశారు.

దీంతో ఉత్తర బెంగాల్ పర్యటనను క్యాన్సిల్ చేసుకొని మరీ తిరిగి వచ్చిన గవర్నర్ సీవీ ఆనంద బోస్.. రాజ్‌భవన్ ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద సిబ్బందిని మోహరించి, వివిధ విభాగాల అధికారులతో పాటు జర్నలిస్టులు సమక్షంలో ప్రత్యక్ష ప్రసారంతో తనిఖీలు నిర్వహించారు. బెనర్జీ ఆరోపణలపై గవర్నర్ బోస్ చట్టపరమైన అభిప్రాయం కోరినట్లు సమాచారం.

మరోవైపు ఎంపీ కల్యాణ్ బెనర్జీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, కోర్టులో పోరాటానికి సిద్ధమని, తనను బెదిరించలేరని స్పష్టం చేశారు.

Next Story