భారత జనాభా 144 కోట్లు.. 24 శాతం మంది 0-14 ఏళ్ల వయసువారే: యూఎన్ఎఫ్‌పీఏ

by Dishanational1 |
భారత జనాభా 144 కోట్లు.. 24 శాతం మంది 0-14 ఏళ్ల వయసువారే: యూఎన్ఎఫ్‌పీఏ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశంలో జనాభా విపరీతమైన రేటుతో వృద్ధి చెందుతోంది. ఇప్పటికే దేశంలో జనాభా 144 కోట్లకు చేరుకుందని యూఎన్ఎఫ్‌పీఏ తాజా నివేదిక అంచనా వేసింది. ఇందులో 24 శాతం మంది 0-14 ఏళ్ల వయసువారు ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్‌పీఏ) 2024 నివేదిక ప్రకారం, దేశ జనాభా 77 ఏళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభాతో భారత్ అగ్రస్థానంలో ఉండగా, 142.5 కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. 2011లో నిర్వహించిన చివరి జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121 కోట్లుగా నమోదైంది. మొత్తం జనాభాలో 24 శాతం మంది 0-14 ఏళ్ల వయస్సువారు, 17 శాతం మంది 10-19 ఏళ్లలోపు వారు ఉన్నారు. 10-24 ఏళ్ల వయసు కలిగిన జనాభా 26 శాతంగా నివేదిక అంచనా వేసింది. 15-64 ఏళ్ల వయసువారు 68 శాతం, 7 శాతం మంది 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ ఉన్నారు. పురుషుల ఆయుర్దాయం 71 సంవత్సరాలు ఉండగా, స్త్రీలు 74 ఏళ్లని నివేదిక పేర్కొంది.

నివేదిక ప్రకారం, దేశంలో 2006-2023 మధ్య 23 శాతం బాల్య వివాహాలు జరిగాయి. దేశంలో ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గాయని, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి మరణాలలో 8 శాతం ఉన్నాయని నివేదిక పేర్కొంది. దేశంలో సరసమైన, నాణ్యమైన ప్రసూతి ఆరోగ్య సేవలు జనాభా పెరుగుదలకు కారణమని నివేదిక అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో, విద్యలో కుల ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్న మహిళలకు చట్టపరమైన రక్షణ కోసం దళిత కార్యకర్తలు గట్టిగా పోరాడుతున్నారని నివేదిక అభిప్రాయపడింది. లేకుంటే చాలామంది వారి కుటుంబాలను పోషించుకోలేక, పిల్లలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించలేక పేదలుగానే మిగిలిపోతారని నివేదిక వెల్లడించింది.

Next Story

Most Viewed