భారీగా తగ్గిన మాల్దీవులకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య

by Dishanational1 |
భారీగా తగ్గిన మాల్దీవులకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, మాల్దీవులకు మధ్య క్షిణిస్తున్న దైపాక్షిక సంబంధాల మధ్య ఆ దీవులకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 33 శాతం తగ్గిందని పర్యాటక మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది. గతేడాది మార్చి 4 నాటికి 41,054 మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. అయితే, ఈ ఏడాది మార్చి 2 నాటికి ఇది 27,224కి తగ్గింది. అంటే ఏకంగా 13,830 మంది పర్యాటకులు తగ్గిపోయారు. గతేడాది మార్చి వరకు మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో 10 శాతం వాటాతో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉండేది. అయితే, ఇప్పుడు భారత్ ఆరు శాతం మార్కెట్ వాటాతో ఆరో స్థానానికి పడిపోయింది. మాల్దీవులకు భారతీయ పర్యాటకుల సంఖ్య తగ్గినా, గత కొన్ని నెలల్లో చైనా పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021 నుంచి 2023 మధ్య ఏటా 2 లక్షల కంటే ఎక్కువ మంది పర్యాటకులతో భారత్ మాల్దీవులకు అగ్ర పర్యాటక మార్కెట్‌గా ఉంది. అయితే, ఇటీవల భారత ప్రధాని మోడీపై మాల్దీవులకు చెందిన మంత్రులు చేసిన కించపరిచే వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య వివాదం ముదురుకుంది. భారత ప్రభుత్వం సైతం మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్ దీవులను సందర్శించాలని పర్యాటకులను కోరడంతో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 54 వేల మందితో చైనా ఇప్పుడ్ మాల్దీవులకు టాప్ మార్కెట్‌గా ఉంది.


Next Story