అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య.. గొడవ ఆపబోతే కాల్చిచంపిన వ్యక్తి!

by Phanindra |

అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మోటల్ ముందు జరుగుతున్న గొడవ ఆపేందుకు వెళ్లిన అతన్ని కాల్చిచంపినట్లు సమాచారం.

అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య.. గొడవ ఆపబోతే కాల్చిచంపిన వ్యక్తి!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన ఒక మోటల్ మేనేజర్‌ను కాల్చిచంపారు. పెన్సిల్వేనియాలోని రాబిన్సన్ టౌన్స్‌షిప్‌లో ఉన్న పిట్స్‌బర్గ్ మోటల్‌లో 51 ఏళ్ల రాకేష్ ఎహాగబన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మోటల్ బయట ఏదో గొడవ జరగడం చూసిన రాకేష్ బయటకు రాగా.. అతన్ని కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. మోటల్ బయట జరుగుతున్న గొడవను ఆపేందుకు రాకేష్ ప్రయత్నించినప్పుడు.. స్టాన్లీ యూజీన్ వెస్ట్ అనే వ్యక్తి అతన్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ‘అంతా బాగానే ఉందా?’ అని స్టాన్లీని రాకేష్ అడుగుతూ ముందుకొచ్చాడని, అప్పుడే స్టాన్లీ డైరెక్ట్‌గా రాకేష్‌ను తలపై కాల్చాడని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.

రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆ తర్వాత మోటల్ బయట మరో యువతిపై కూడా స్టాన్లీ కాల్పులు జరపగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులపై కూడా షూటింగ్స్ జరిపాడని, ఒక అధికారి తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన స్టాన్లీని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story