- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షిపణి దాడి ఘటనలో భారత పౌరులు మరణించలేదు: సౌదీ రాయబార కార్యాలయం
సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ (Al Kharj) గవర్నరేట్లో నివాస ప్రాంతంపై క్షిపణి పడిన ఘటనలో భారత పౌరులెవరూ మరణించలేదని రియాద్లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ (Al Kharj) గవర్నరేట్లో నివాస ప్రాంతంపై క్షిపణి పడిన ఘటనలో భారత పౌరులెవరూ మరణించలేదని రియాద్లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. తొలుత ఒక భారతీయుడు మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం అందులో వాస్తవం లేదని రాయబార కార్యాలయం సోమవారం (మార్చి 9) ప్రకటించింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మరణించారని, అందులో భారతీయ వ్యక్తి లేకపోవడం ఊరటనిచ్చే విషయమని రాయబార కార్యాలయం 'X' వేదికగా తెలిపింది.
సౌదీ అధికారులతో సంప్రదింపులు
ఈ ప్రమాదంలో ఒక భారతీయ పౌరుడు గాయపడ్డారు. రాయబార కార్యాలయ కౌన్సిలర్ వై. సాబిర్ గతరాత్రి అల్-ఖర్జ్లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, బాధితుడిని పరామర్శించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్స అందుతోంది. ఈ ఘటనకు సంబంధించి భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల ఒక భారతీయుడు, ఒక బంగ్లాదేశీయుడు మరణించినట్లు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే భారత రాయబార కార్యాలయం తాజా ప్రకటనతో ఆ ఆందోళనలకు తెరపడింది.






