ఇండియన్ నేవీ.. ఐఎన్‌ఎస్ శాతవాహనలో వినూత్నంగా అండర్ వాటర్ యోగా

by Ramesh Naini |

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (2026) పురస్కరించుకుని విశాఖపట్నంలోని ‘ఐఎన్‌ఎస్ శాతవాహన’ లో ఇండియన్ నేవీ సిబ్బంది వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇండియన్ నేవీ.. ఐఎన్‌ఎస్ శాతవాహనలో వినూత్నంగా అండర్ వాటర్ యోగా
X

దిశ, డైనమిక్ బ్యూరో: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (2026) పురస్కరించుకుని విశాఖపట్నంలోని ‘ఐఎన్‌ఎస్ శాతవాహన’ (INS Satavahana)లో ఇండియన్ నేవీ సిబ్బంది వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 20వ తేదీన సబ్ మెరైన్ విభాగానికి చెందిన 40 మంది సిబ్బంది నీటి అడుగున ఒకేసారి సమన్వయంతో యోగాసనాలు వేసి విశేషంగా ఆకట్టుకున్నారు. లెఫ్టినెంట్ కమాండర్ ఆరుష్ శర్మ (Aarush Sharma), నేవీకి చెందిన యోగా నిపుణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది నీటి అడుగున ‘భుజంగాసనం’ (కోబ్రా పోజ్) లాంటి ఆసనాలను ప్రదర్శించారు. క్లిష్టమైన పరిస్థితుల్లో శ్వాసను నియంత్రించుకుంటూ, ఎంతో ఏకాగ్రత, ఓర్పు మరియు క్రమశిక్షణతో తమ అసాధారణ నైపుణ్యాలను చాటుకున్నారు.

విధి నిర్వహణలో ఎదురయ్యే తీవ్ర ఒత్తిడిని అధిగమించేందుకు శారీరక, మానసిక దృఢత్వం ఎంత అవసరమో ఈ అండర్ వాటర్ యోగా సెషన్ ద్వారా నావికాదళం స్పష్టం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించే ఈ వినూత్న కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఐఎన్‌ఎస్ శాతవాహన తమ అధికారిక ఎక్స్ (X) ఖాతాలో పంచుకోగా, ప్రస్తుతం అది నెట్టింట విశేషంగా ఆకర్షిస్తోంది.

Next Story