పలావ్ వాణిజ్య నౌకకు భారత నౌకాదళం సాయం

by Dishanational2 |
పలావ్ వాణిజ్య నౌకకు భారత నౌకాదళం సాయం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రంలో పలు వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం పలావ్ దేశానికి చెందిన ఎంవీ ల్యాండ్ ఇస్లాండ్ అనే వాణిజ్య నౌక క్షిపణి దాడికి గురికాగా.. అందులోని సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ నౌకకు భారత యుద్ధనౌక సాయం అందించినట్టు భారత నౌకాదళ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ శనివారం తెలిపారు. ఇండియన్ నేవీకి చెందిన రెస్య్కూ టీమ్ నౌకను ఎక్కి సాయం అందించినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత నౌకను తదుపరి రవాణా కోసం పంపించినట్టు వెల్లడించారు. ఓడ నుంచి వచ్చిన ప్రమాద కాల్‌కు వేగంగా ప్రతిస్పందించిన భారత యుద్ధనౌక కొన్ని గంటల్లోనే కీలకమైన సహాయాన్ని అందించడానికి కార్గో షిప్ సమీపంలోకి చేరుకుందని తెలిపారు.

గత కొన్ని వారాలుగా, పశ్చిమ హిందూ మహాసముద్రంలో అనేక వ్యాపార నౌకలపై దాడులు జరగగా భారత నౌకాదళం రక్షణ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. గత నెలలో సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగల దాడికి గురైన ఇరాన్ ఓడలోని 19 మంది పాకిస్తానీ సిబ్బందిని భారత యుద్ధనౌక రక్షించింది. అలాగే సోమాలియా తూర్పు తీరం వెంబడి 11 మంది ఇరాన్, ఎనిమిది మంది పాకిస్తానీ పౌరులతో కూడిన ఫిషింగ్ నౌకపై దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించగా దానిని భారత నౌకాదళం విఫలం చేసింది. అంతేగాక ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియన్ షిప్ ఎంవీ లీలా నార్ఫోక్ నౌకను హైజాక్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకుని అందులోని సిబ్బంది మొత్తాన్ని రక్షించింది.

Next Story

Most Viewed