‘ఇండియా’ వర్సెస్ బీజేపీ: జనవరి 18న తొలిపోరు

by Dishanational2 |
‘ఇండియా’ వర్సెస్ బీజేపీ: జనవరి 18న తొలిపోరు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్ష ఇండియా కూటమి బీజేపీతో తలపడటానికి సిద్ధంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. జనవరి 18న జరిగే చండీగఢ్ మేయర్ ఎన్నికలు ఈ పోరుకు తెరలేపుతాయని చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ ఇండియా కూటమి తన మొదటి ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. చండీగఢ్ మేయర్ ఎన్నిక సాధారణ ఎన్నికలు కాదు. ఇది దేశ రాజకీయ గమనాన్ని మారుస్తుంది. ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు పునాది వేస్తుంది. బీజేపీ వర్సెస్ ఇండియా తొలి ఎన్నికలుగా దీన్ని పిలుస్తారు. ఈ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు అందుకుంటుంది. ఈ గెలుపు చండీగఢ్‌కే పరిమితం కాదు. దేశమంతటా విస్తరిస్తుంది’ అని చెప్పారు. చండీగఢ్ ఎన్నికల్లో ‘ఇండియా’ విజయానికి ప్రజలు సహకరిస్తారని తెలిపారు. ‘ఇండియా’ కూటమి కలిసి ఎన్నికల్లో పోరాడినప్పుడు దాని బలం మరింత పెరుగుతుందని ఈ ఎన్నికలు నిరూపిస్తాయన్నారు. కాగా, గురువారం జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికలకు ఆప్, కాంగ్రెస్‌లు పొత్తుకు నిర్ణయం తీసుకున్నాయి. 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉండగా, ఆప్‌కు 13 మంది, కాంగ్రెస్‌కు ఏడుగురు ఉన్నారు.



Next Story

Most Viewed