Bangladesh: బంగ్లాలో హిందూ మైనార్టీ నేత హత్యపై స్పందించిన విదేశాంగ శాఖ

by Shamantha N |

బంగ్లాదేశ్‌ (Bangladesh)లో మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. బంగ్లాలో హిందూ మైనార్టీ నేత భబేష్ చంద్ర రాయ్ కిడ్నాప్, దారుణ హత్యపై విదేశాంగ శాఖ స్పందించింది.

Bangladesh: బంగ్లాలో హిందూ మైనార్టీ నేత హత్యపై స్పందించిన విదేశాంగ శాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. బంగ్లాలో హిందూ మైనార్టీ నేత భబేష్ చంద్ర రాయ్ కిడ్నాప్, దారుణ హత్యపై విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీ నేత భబేష్ చంద్ర రాయ్‌ కిడ్నాప్, దారుణ హత్య గురించి మా దృష్టికి వచ్చింది. ఆ ఘటన చాలా బాధాకరం. బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వపాలనలో హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఇంకో ఘటన. గతంలో ఈ తరహా దాడులకు పాల్పడినవారు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా మైనార్టీలను రక్షించే బాధ్యత ఈ తాత్కాలిక ప్రభుత్వం నిర్వహించాలని మరోసారి గుర్తుచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ లో మైనార్టీ నేత హత్య

ఉత్తర బంగ్లాదేశ్‌ (Bangladesh)లోని దినాజ్‌పుర్‌కు చెందిన భబేష్ చంద్రరాయ్‌ (58)కు గురువారం సాయంత్రం ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాను ఇంట్లోనే ఉన్నానని భబేశ్‌ అవతలి వ్యక్తికి చెప్పారు. కొంత సేపటి తర్వాత నలుగురు వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. వారి ఫిర్యాదు మేరకు గాలింపుచర్యలు చేపట్టిన పోలీసులకు నరబరి గ్రామంలో భబేష్ తీవ్రగాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కన్పించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందారు. దుండగులు అతడిని తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. బంగ్లా ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా దిగిపోయినప్పట్నుంచి అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనిపైనా భారత్ పలు మార్లు స్పందించింది. అయినా అక్కడ మాత్రం దాడులు ఆగట్లేదు.

Next Story