'గిస్సార్‌'కు గుస్సా వస్తే.. పాకిస్తాన్‌ ఖేల్‌ ఖతం..!

by Bhanu |   (  Updated:2025-05-06 15:49:28  IST  )

పహల్గామ్‌లో 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడి భారతదేశాన్ని తీవ్రంగా కలచివేసింది.

గిస్సార్‌కు గుస్సా వస్తే.. పాకిస్తాన్‌ ఖేల్‌ ఖతం..!
X

దిశ, వెబ్‌డెస్క్‌: పహల్గామ్‌లో 26 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడి భారతదేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ దారుణానికి ప్రతిగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికి భారత్ సిద్ధమైంది. దశాబ్దాలుగా ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్‌లో ఇప్పుడు భయం గుప్పుమంటోంది. భారతదేశం తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్తాన్‌కు తెలుసు. తూర్పు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి బిక్కుబిక్కుమంటోంది. అయితే, పాకిస్తాన్‌కు పశ్చిమాన, ఒక ముస్లిం దేశంలో భారత్ ఒక శక్తివంతమైన వైమానిక స్థావరాన్ని రహస్యంగా ఏర్పాటు చేసిందని మీకు తెలుసా..? అక్కడి నుంచి పెషావర్, ఇస్లామాబాద్, పీవోకే కేవలం పిడిగుడ్డు దూరంలో ఉన్నాయి.. భారత్ కనుక ఆ స్థావరాన్ని ఉపయోగిస్తే, పాకిస్తాన్ విధ్వంసాన్ని ఆపడం అసాధ్యం.

మీడియా కథనాల ప్రకారం.. తజికిస్తాన్‌లోని భారత వైమానిక స్థావరం పాకిస్తాన్‌పై ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారనుంది. పాకిస్తాన్ తన రక్షణ వనరులను ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు విస్తరించాల్సి వస్తుంది. ఈ రహస్య స్థావరం పేరు గిస్సార్ మిలిటరీ ఏరోడ్రోమ్ (ఎనీ ఎయిర్‌బేస్). 1990లలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం దీన్ని నిర్మించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కేవలం 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాకిస్తాన్ తన తూర్పు సరిహద్దుల నుండి మాత్రమే ముప్పు ఉంటుందని భావిస్తోంది. అందుకే అక్కడ వైమానిక రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసింది, సైనిక విన్యాసాలు చేస్తోంది. కానీ, పశ్చిమాన ఉన్న ఈ ముస్లిం దేశంలోని భారత వైమానిక స్థావరం గురించి వారికి ఎంతవరకు తెలుసో?

ఇదిలా ఉంటే, భారతదేశంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా మే 7న 244 జిల్లాల్లో మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది ఉగ్రదాడులను ఎదుర్కోవడానికి దేశం సన్నద్ధతను తెలియజేస్తుంది. తజికిస్తాన్‌లోని ఈ వైమానిక స్థావరం నుండి భారత్ దాడి చేస్తే, పాకిస్తాన్ పతనం తప్పదు. ఎనీ ఎయిర్‌బేస్, తజికిస్తాన్ రాజధాని దుషాన్‌బే నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి పెషావర్ 500 కి.మీ., ఇస్లామాబాద్ , పీవోకే 600 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఈ నగరాలు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుండి కేవలం 150 కి.మీ. దూరంలో ఉండటం గమనార్హం.

భారతదేశానికి ఈ స్థావరం నుండి దాడి చేయడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, మరొకటి పీవోకే , ఉత్తర తజికిస్తాన్ మధ్య ఉన్న వఖాన్ కారిడార్ ద్వారా. భద్రతా పరంగా ఈ రెండు మార్గాలు బలహీనమైనప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్‌లో వాయు రక్షణ లేకపోవడం వల్ల మొదటి మార్గం ద్వారా పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకోవడం సులభం. వఖాన్ కారిడార్ కూడా భద్రతా రహిత ప్రాంతం కాబట్టి, అవసరమైన సమయంలో ఉపయోగపడుతుంది. ఇప్పటికే భారత్ ఇక్కడ SU-30MKI వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరించిందని సమాచారం.

1990ల నుండి భారత సైన్యం తజికిస్తాన్‌లో తన ఉనికిని చాటుతోంది. 9/11 దాడుల తర్వాత, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ , మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్. ధనోవా వంటి భారత అధికారులు ఈ వైమానిక స్థావరాన్ని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం , రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కూడా ఈ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు తెలిపారు. భారత్ ఇక్కడ 3,200 మీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించడమే కాకుండా, విమానాలకు అవసరమైన అన్ని అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసింది. పహల్గామ్ రక్తగాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. తూర్పు సరిహద్దుల్లో భయంతో వణికిపోతున్న పాకిస్తాన్‌కు పశ్చిమాన ఉన్న ఈ రహస్య స్థావరం గురించి తెలిస్తే వారి పరిస్థితి ఏమవుతుందో ఊహించగలరా..? భారతదేశం తన వ్యూహాత్మక అస్త్రాన్ని ఎప్పుడు ఉపయోగిస్తుందో వేచి చూడాలి..

Next Story